సాక్షి,విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో ఓ వృద్ధురాలు అధికారులపై కారం చల్లారు. నేషనల్ హైవే నిర్మాణం కోసం అధికారులు ఆమె భూమిని స్వాధీనం చేసుకున్నారు. అయితే, బదులుగా ఇవ్వాల్సిన రూ.24 లక్షల నష్టపరిహారం ఇప్పటికీ అందలేదని వృద్ధురాలు ఆరోపించారు. తనకు న్యాయం చేయాలని కోరుతూ అనేక సార్లు కలెక్టరేట్లో వినతిపత్రాలు సమర్పించినా, అధికారులు పట్టించుకోలేదని ఆమె తెలిపారు.
ఈ నేపథ్యంలో సోమవారం కలెక్టరేట్కు వచ్చిన బాధితురాలు అధికారుల నిర్లక్ష్యంపై ఆవేదన వ్యక్తం చేస్తూ కారం చల్లారు. తన భూమి తీసుకుని వేరే వారికి డబ్బులు చెల్లించారని ఆరోపించారు. అధికారుల తీరుతో విసుగెత్తి ఈ చర్యకు దిగినట్లు వృద్ధురాలు మీడియా ఎదుట వెల్లడించారు.


