గోడ చాటున గుట్టు! | Committee of Ministers personally supervised the arrangements in Simhagiri | Sakshi
Sakshi News home page

గోడ చాటున గుట్టు!

May 2 2025 5:41 AM | Updated on May 2 2025 7:32 AM

Committee of Ministers personally supervised the arrangements in Simhagiri

సింహాచలంలో విచారణ కమిషన్‌కు వివరణ ఇస్తున్న కాంట్రాక్టర్‌

ఐదుగురు మంత్రులున్నా.. ఏడుగురి ప్రాణాలు బలి

సింహగిరిలో ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించిన మంత్రుల కమిటీ

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: స్వయంగా ఐదుగురు మంత్రుల కమిటీ దాదాపు పక్షం రోజులకుపైగా సింహగిరిపై చందనోత్సవ వేడుకల నిర్వహణ ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చిన్న చిన్న అంశాలను సైతం పరిగణనలోకి తీసుకొని అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు హోంమంత్రి వంగలపూడి అనిత నమ్మకంగా చెప్పారు. అయినా సరే.. అప్పన్న నిజరూప దర్శన వేళ పెను విషాదం చోటు చేసుకుంది. ఏర్పాట్లలో మంత్రుల కమిటీ దారుణ వైఫల్యం ఏడుగురు భక్తుల ప్రాణాలను బలి తీసుకుంది. కనీసం ఓ గోడను కూడా పటిష్టంగా నిర్మించలేని బాధ్యతా రాహిత్యం భక్తులను పొట్టనబెట్టుకుంది. 

సాక్షాత్తూ మంత్రుల పర్యవేక్షణలోనే ఇలా జరిగిందంటే ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కాదా? దీన్ని కప్పిపుచ్చుకునేందుకు తాజాగా బహిరంగ విచారణ పేరుతో నాటకాన్ని సర్కారు రక్తి కట్టించింది. చందనోత్సవం రోజు వర్షం కురవడం సాధారణమే అయినప్పటికీ అందుకు అనుగుణంగా జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. పవిత్ర పుణ్యక్షేత్రాల్లో వరుసగా అపచారాలు, కూటమి సర్కారు నిర్వాకాలు, అంతులేని నిర్లక్ష్యం తాజాగా మరోసారి బహిర్గతం కావడంతో ఉలిక్కిపడి కింది స్థాయి ఉద్యోగులు, కాంట్రాక్టర్‌పై నెపం మోపి తప్పించుకునేందుకు రంగం సిద్ధం చేసింది. 

ఇందులో భాగంగానే ఇదంతా కాంట్రాక్టర్, ఉద్యోగుల  తప్పిదమేనంటూ అనుకూల మీడియాలో ఇప్పటికే లీకులిచ్చింది. తిరుపతి చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా తొక్కిసలాట చోటు చేసుకుని ఆరుగురు భక్తులు మృత్యువాత పడితే తన వైఫల్యాలను కప్పిపుచ్చి గుంభనంగా వ్యవహరించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా సింహాచలంలో మాత్రం బహిరంగ విచారణ చేపట్టి ఈ విషాదానికి కాంట్రాక్టర్, ఉద్యోగులను బాధ్యులుగా చేసి తప్పించుకునేందుకు సిద్ధమైనట్లు స్పష్టమవుతోంది. అనుమతి లేకుండానే మాస్టర్‌ ప్లాన్‌లో మార్పులు ప్రభుత్వ జోక్యం లేకుండా సాధ్యమేనా? అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

తాత్కాలికమే కదా.. కట్టమన్నారు!
‘ప్లానింగ్‌ ప్రకారం డ్రాయింగ్‌లో అసలు ఈ గోడ నిర్మాణం లేదని చెప్పా. తాత్కాలికమే కదా...! చందనోత్సవం కోసం కట్టమని ఒత్తిడి తెచ్చారు. మీకు తెలియంది ఏముంది సర్‌? టూరిజం, దేవదాయ శాఖలు గోడ కట్టమన్నాయి. దేవుడి కార్యక్రమం కదా అని డ్రాయింగ్‌లో లేకపోయినా అతిక్రమించి చేశా. ఐదు రోజుల్లోనే గోడ నిర్మించా. ఈ గోడ నిర్మాణంపై పరీక్షలు ఏమీ జరగలేదు..’ అని సింహాచలంలో ఏడుగురి సజీవ సమాధికి కారణమైన గోడను నిర్మించిన కాంట్రాక్టరు లక్ష్మణరావు గురువారం విచారణ కమిషన్‌ ఎదుట వెల్లడించారు. మాస్టర్‌ ప్లాన్‌కు విరుద్ధంగా నిర్మింంచిన ఈ గోడ కోసం అంచనాలు రూపొందించడంగానీ, అనుమతి గానీ తీసుకోలేదని కమిషన్‌ ఎదుట తేలిపోయింది. గోడ కట్టిన తర్వాత కనీసం పరీక్షలు కూడా చేయలేదని బట్టబయలైంది. 

ఒత్తిడి తెచ్చి పనులు హడావుడిగా చేయించారు
సింహాద్రి అప్పన్న చందనోత్సవం సందర్భంగా గోడకూలి ఏడుగురు మృతి చెందిన ఘటనపై 72 గంటల్లో నివేదిక సమర్పించాలంటూ మునిసిపల్, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్యకార్యదర్శి సురేష్‌కుమార్‌ నేతృత్వంలో ఐజీ ఆకే రవికృష్ణ, జలవనరులశాఖ ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ (ఈఎన్‌సీ) వెంకటేశ్వరరావులతో కమిషన్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయడం తెలిసిందే. గురువారం ఉదయం పదిన్నర గంటలకు సింహాచలంలో విచారణ ప్రారంభించిన కమిషన్‌ గోడ నిర్మాణానికి సంబంధించి కాంట్రాక్టర్‌తో పాటు దేవదాయ, టూరిజం శాఖ అధికారులను విచారించింది. 

గోడ కూలిన ప్రాంతాన్ని పరిశీలించి శిథిలాల  నుంచి ఇటుకలు, మట్టిని విచారణ అధికారులు సేకరించారు. కేవలం 5 రోజుల్లోనే గోడ నిర్మాణాన్ని పూర్తి చేశామని... తమ మీద ఒత్తిడి తెచ్చి పనులు హడావుడిగా చేయించారని విచారణాధికారి ఎదుట కాంట్రాక్టర్‌ కుండబద్దలు కొట్టారు. ప్లాన్‌లో లేకుండానే పనులు చేయించారని, గోడ పటిష్టతపై ల్యాబ్‌లో ఎలాంటి పరీక్షలు చేయలేదని తెలిపారు. 

అనుమతులు లేకుండానే...
డ్రాయింగ్‌లో లేని తాత్కాలిక గోడ నిర్మాణం విషయంలో అనుమతులు తీసుకున్నారా? అని కమిషన్‌ ఆరా తీసింది. దీనికి సంబంధించిన నోట్‌ ఫైల్, ఎం బుక్, వర్క్‌ ఆర్డర్, మీటింగ్‌ మినిట్స్‌ లాంటివి లేవని విచారణలో వెల్లడైంది. కేవలం నోటి మాట ఆధారంగా పని చేయలేమని.. డ్రాయింగ్, ప్లానింగ్‌ ఇవ్వాలని కాంట్రాక్టర్‌ కోరడం నిజం కాదా? అని సురేష్‌కుమార్‌ ప్రశ్నించగా అవునని అధికారులు అంగీకరించారు. 

మాస్టర్‌ ప్లాన్‌కు విరుద్ధంగా..
సింహాచలం కొండ ‘యూ’ ఆకారంలో ఉంటుంది. కొండధారలు, ఆకాశగంగ, మాడవీధులు.. ఎక్కడ వర్షం కురిసినా తాజాగా ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఉన్న మెట్ల మీద నుంచే నీరంతా కిందకు వెళ్తుంది. అందుకే ఈ ప్రాంతంలో పటిష్టమైన రిటైనింగ్‌ వాల్‌ నిర్మించారు. దాన్ని ప్రసాద్‌ స్కీమ్‌లో పునర్‌ నిర్మించేందుకు పాత గోడని తొలగించారు. చందనోత్సవం నేపథ్యంలో తాత్కాలిక గోడని నాసిరకంగా, ఫ్లైయాష్‌ ఇటుకలతో కట్టారు. 

అది చిన్నపాటి వర్షానికే కూలిపోయింది. రూ.300 టికెట్ల లైన్‌ ఫెన్సింగ్‌ గోడకి ఆనుకొని వేశారు. ఫెన్సింగ్‌ లేకుంటే శిథిలాలు కొంతమేర తొలగించుకొని భక్తులు బయట పడేందుకు ప్రయత్నించేవారు. కానీ ఫెన్సింగ్‌ అడ్డుగా ఉండటంతో వాటిని తొలగించడం సాధ్యంకాక భక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు స్పష్టమవుతోంది. అంటే కనీస ప్రణాళిక లేకుండా, భక్తుల భద్రత గురించి ఏమాత్రం ఆలోచన చేయకుండా హడావుడిగా పనులు చేసినట్లు తెలుస్తోంది.  

నాసిరకంగా నిర్మించారు..
తాత్కాలికంగా నిర్మించిన రిటైనింగ్‌ వాల్‌ నాసిరకంగా కట్టారు. దానివల్ల వర్షం పడే సమయంలో కూలిపోయిందని చాలా స్పష్టంగా అర్థమవుతోంది. అలా ఎందుకు నిర్మించాల్సి వచ్చింది..? హడావుడిగా ఎందుకు చేయాల్సి వచ్చింది? నిజంగా అది నాసిరకంగా ఉందా? అనే వాటికి ఆధారాలు తీసుకున్నాం. ప్రసాద్‌ స్కీమ్‌ ఒరిజినల్‌ పనుల్లో మార్పులు చేర్పులు జరిగాయి. దాని ఆధారంగానే ఈ పనులు చేపట్టారు. ఎవరు అనుమతి ఇచ్చారు? డిజైన్‌ ఏమిటి? ఎవరు పరీక్షించారనేది విచారిస్తున్నాం. 

చందనోత్సవం ఉన్నందున త్వరితగతిన చేశామని చెబుతున్నారు. గత ఏడాది కాలంలో మాస్టర్‌ప్లాన్‌లో కొన్ని మార్పులు చేర్పులు చేశారు. దానిలో భాగంగా ఈ గోడను నిర్మించారు. మూడు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇస్తాం. ఇటువంటివి పునరావృతం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నెల రోజుల్లో సవివర నివేదిక సమర్పించాల్సి ఉంది. అందులో పూర్తిస్థాయి ఎస్‌వోపీలను పొందుపరుస్తాం.  – సురేష్‌ కుమార్, విచారణ కమిషన్‌ అధ్యక్షుడు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement