
కూటమి సర్కార్ రాజకీయ కక్షతో నాపై అక్రమ కేసు పెట్టించింది
మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి ఆగ్రహం
సాక్షి, నరసరావుపేట: పల్నాడు జిల్లా గుండ్లపాడులో జరిగిన జంట హత్యలకు టీడీపీలోని ఆధిపత్య పోరే కారణమని మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పారు. ఈ విషయాన్ని ప్రత్యక్ష సాక్షితో పాటు జిల్లా ఎస్పీ కూడా ప్రకటించారని పేర్కొన్నారు. అయినా కూడా కూటమి సర్కార్ రాజకీయ కక్షతో తనపై అక్రమ కేసు నమోదు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుండ్లపాడు జంట హత్యలపై వెల్దుర్తి పోలీసుస్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్లో తన పేరు చేర్చడంపై పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆదివారం స్పందించారు.
టీడీపీలోని ఆధిపత్య పోరుతోనే జవిశెట్టి వెంకటేశ్వర్లు, జవిశెట్టి కోటేశ్వరరావును అదే పార్టీలోని ప్రత్యర్థి వర్గం పొట్టన పెట్టుకుందన్నారు. ఈ విషయాన్ని హత్య జరిగినప్పుడు చూసిన ప్రత్యక్ష సాక్షి, మృతుల అల్లుడు తోట ఆంజనేయులు మీడియాతో పాటు పోలీసులకు కూడా తెలియజేశారన్నారు. టీడీపీలోని వర్గపోరు వల్లే ఈ హత్యలు జరిగాయని పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు సైతం శనివారం ప్రకటించారని గుర్తు చేశారు.
ఇటీవల ఫ్లెక్సీల విషయంలో గొడవలు జరగ్గా. ఇరు వర్గాలు టీడీపీ వాళ్లేనని వదిలేయడంతో సమస్య పెద్దదైందన్నారు. ఆనాడే వారిపై పోలీసులు కఠిన చర్యలు తీసుకొని ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. హత్య జరిగిన ప్రదేశంలో జేబీఆర్ పేరుతో టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి అనుచరుడి కారు దొరికినా.. ప్రత్యక్ష సాక్షులు సైతం హత్యలు చేసింది టీడీపీ వాళ్లేనని చెబుతున్నా.. తనపై ఎందుకు నిందలు వేస్తున్నారని పిన్నెల్లి ప్రశ్నించారు. జంట హత్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదన్న విషయం మాచర్ల ప్రజలందరికీ తెలుసునన్నారు.
అసమర్థతను కప్పిపుచ్చుకునేందుకే టీడీపీ ఎమ్మెల్యే జూలకంటి తనపై అక్రమ కేసు నమోదు చేయించారని మండిపడ్డారు. ఈ హత్యలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఏ గుడిలోనైనా ప్రమాణం చేసేందుకు సిద్ధమన్నారు. ధైర్యం ఉంటే బ్రహ్మారెడ్డి తన పిల్లలపై ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. ఎన్ని అడ్డంకులు
సృష్టించినా ప్రజల తరఫున పోరాడుతామని పిన్నెల్లి స్పష్టం చేశారు.