Andhra Pradesh: సంస్కరణలకు శుభారంభం

CM YS Jagan review on implementation of education sector reforms - Sakshi

నూతన విద్యా విధానానికి అనుగుణంగా అదనపు తరగతి గదులు

అవసరమైన టీచర్ల సంఖ్య కూడా గుర్తింపు

డైట్‌ సంస్థల సమర్థత పెంచి టీచర్లలకు నాణ్యమైన శిక్షణ 

స్కూళ్లలో సమస్యలపై ఫిర్యాదుకు కాల్‌సెంటర్‌.. ప్రతి పాఠశాలలో అందరికీ తెలిసేలా నంబర్‌ 

ఆంగ్ల భాష ఉచ్ఛారణ, భాష, వ్యాకరణాలపై ప్రత్యేక శ్రద్ధ 

మన ఇంట్లో లాగానే స్కూళ్లలో పరిశుభ్రమైన టాయిలెట్స్‌ 

కలెక్టర్లు, జేసీలు, అధికారులకు గోరుముద్ద అమలు పర్యవేక్షణ 

స్వయంగా భోజనం చేసి నాణ్యతను పరిశీలించాల్సిందే

ఎయిడెడ్‌ పాఠశాలలను ప్రభుత్వానికి అప్పగించడం పూర్తిగా స్వచ్ఛందమే

ఎక్కడా బలవంతం లేదు.. అపోహలకు తావులేదు

విద్యారంగ సంస్కరణల అమలుపై సమీక్షలో సీఎం జగన్‌ 

సాక్షి, అమరావతి: రానున్న విద్యా సంవత్సరంలో నూతన విద్యావిధానం అమలు చేయడానికి అవసరమైన చోట్ల అదనపు తరగతి గదుల నిర్మాణంపై దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. కార్యాచరణ పూర్తిచేసి వెంటనే పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మొత్తం ప్రక్రియ పూర్తయ్యేనాటికి అవసరమైన టీచర్ల సంఖ్యను కూడా గుర్తించాలని సూచించారు. విద్యారంగంలో తెచ్చిన సంస్కరణలు, నూతన విద్యా విధానంపై సీఎం జగన్‌ బుధవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా టీచర్లను నియమించడంతోపాటు సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులతో బోధనే లక్ష్యంగా నూతన విద్యా విధానాన్ని ప్రభుత్వం అమల్లోకి తెస్తున్న విషయం తెలిసిందే. 

టీచర్లకు అత్యుత్తమ శిక్షణ 
టీచర్లకు శిక్షణ ఇచ్చే డైట్‌ సంస్థల సమర్థత పెంచాలని ముఖ్యమంత్రి జగన్‌ సూచించారు. టీచర్లకు అత్యంత నాణ్యమైన శిక్షణ అందాలని, ఈ కార్యక్రమాలపై వచ్చే సమావేశంలో వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు. 

స్కూళ్లలో సమస్యలపై కాల్‌సెంటర్‌ 
పాఠశాలల్లో సదుపాయాలకు సంబంధించి ఏమైనా సమస్యలు, ఇబ్బందులు ఉంటే వెంటనే కాల్‌ చేసేలా ఒక నంబర్‌ అందుబాటులోకి తేవాలని సీఎం ఆదేశించారు. ప్రతి స్కూల్‌లో అందరికీ కనిపించేలా ఈ నంబర్‌ను ప్రదర్శించాలని సూచించారు. ఈ కాల్‌సెంటర్‌ను అధికారులు పర్యవేక్షణ చేసిన వారి నుంచి ఫీడ్‌ బ్యాక్‌ తీసుకుని, తగిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 

ఇంగ్లీషుపై ప్రత్యేక శ్రద్ధ
ఇంగ్లీషు ఉచ్ఛారణ, భాష, వ్యాకరణాలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకునేలా పాఠ్య ప్రణాళికపై దృష్టి సారించాలని ముఖ్యమంత్రి జగన్‌ పేర్కొన్నారు. విద్యార్థులకు ఇప్పటికే ఇచ్చిన డిక్షనరీలను వినియోగించుకోవాలన్నారు. ప్రతి రోజూ కనీసం మూడు కొత్త పదాలు నేర్పించి వాటిని సాధన చేసేలా పిల్లలకు మెళకువలు నేర్పాలని సూచించారు. 

మరుగుదొడ్లు నిర్వహణ
ఇంట్లో మరుగుదొడ్లు పరిశుభ్రంగా ఉండాలని ఎలా కోరుకుంటామో విద్యార్థులు చదివే పాఠశాలల్లో కూడా అలాగే ఉండాలని ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టం చేశారు. నాణ్యమైన సదుపాయాలు అందరి లక్ష్యం కావాలన్నారు. పాఠశాలల్లో మరుగుదొడ్ల స్థితిగతులపై ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని ఆదేశించారు. టాయిలెట్స్‌లో ట్యాప్‌లు పనిచేయక, నీళ్లు రాక దుర్గంధంతో ఎవరూ వినియోగించని పరిస్థితులు గతంలో చూశామన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో అలాంటి దుస్థితిని నాడు – నేడు ద్వారా సమూలంగా మార్చామని ముఖ్యమంత్రి తెలిపారు. క్రమం తప్పకుండా పర్యవేక్షిస్తూ పిల్లలకు మంచి వాతావరణం అందుబాటులో ఉంచాలని సూచించారు.

విద్యారంగంపై సమీక్ష నిర్వహిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

హెడ్‌మాస్టర్లే కుటుంబ పెద్దలు
పాఠశాలలకు హెడ్‌ మాస్టర్లే కుటుంబ పెద్దలని సీఎం జగన్‌ పేర్కొన్నారు. మెరుగైన రీతిలో బోధన దగ్గర నుంచి నాణ్యమైన భోజనం, సదుపాయాలు, మౌలిక వసతులపై తనిఖీలు నిర్వహిస్తూ అంతా సవ్యంగా ఉండేలా హెడ్మాస్టర్లను చైతన్యం చేయాలని సూచించారు. వీటిపై ప్రతిరోజూ పర్యవేక్షణ జరగాలని స్పష్టం చేశారు. 

గోరుముద్దపై ఫీడ్‌ బ్యాక్‌
గోరుముద్దపై క్రమం తప్పకుండా ఫీడ్‌బ్యాక్‌ తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. పిల్లలు, తల్లుల నుంచి తప్పకుండా ఫీడ్‌ బ్యాక్‌ తీసుకోవాలని స్పష్టం చేశారు. ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా, సమస్య తలెత్తినా వెంటనే స్పందించి తగిన చర్యలు తీసుకోవాలన్నారు. కలెక్టర్లు, జేసీలు, అధికారులు తప్పనిసరిగా గోరుముద్ద అమలును పర్యవేక్షించాలని, స్వయంగా భోజనం చేసి నాణ్యతను పరిశీలించాలని ముఖ్యమంత్రి సూచించారు.

లెర్న్‌ టు లెర్న్‌ కాన్సెప్ట్‌ 
లెర్న్‌ టు లెర్న్‌ కాన్సెప్ట్‌ను పాఠ్యప్రణాళికలో తీసుకురావాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. ఇంటర్నెట్, ఎలక్ట్రానిక్‌ పరికరాల ద్వారా వివిధ అంశాలను నేర్చుకోవడం, ఇతరులకు తెలియచేయడం లాంటి కాన్సెప్ట్‌ను పిల్లలకు నేర్పాలని అధికారులకు 
సూచించారు.

1,092 స్కూళ్లకు సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌
సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌పై కూడా ముఖ్యమంత్రి జగన్‌ సమీక్షించారు. 1,092 స్కూళ్లలో 2021–22 విద్యా సంవత్సరంలో సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. దేశంలో ఒకే ఏడాది 1092 స్కూళ్లకు సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ ఇవ్వడం రికార్డని చెప్పారు. ఈ విద్యార్థులు 2024–25 నాటికి పదో తరగతి పరీక్షలు రాస్తారని తెలిపారు. అంతర్జాతీయంగా 24 వేల స్కూళ్లకు మాత్రమే సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ ఉందని వివరించారు. 

మూడు దశలుగా మూడేళ్లలో...
శాటిలైట్‌ ఫౌండేషనల్‌ స్కూల్స్, ఫౌండేషనల్‌ స్కూల్స్, ఫౌండేషనల్‌ ప్లస్‌ స్కూల్స్, ప్రీ హైస్కూల్స్, హైస్కూల్స్, హైస్కూల్‌ ప్లస్‌ స్కూళ్లపై సమావేశంలో అధికారులు ముఖ్యమంత్రికి వివరాలు అందచేశారు. 2021–22 నుంచి 2023–24 వరకూ మూడు విద్యా సంవత్సరాల్లో మూడు దశలుగా నూతన విద్యా విధానం పూర్తిగా అమలు కానుంది. ఇందులో భాగంగా 25,396 ప్రైమరీ పాఠశాలలను యూపీ (అప్పర్‌ ప్రైమరీ) స్కూళ్లు, హైస్కూళ్లలో విలీనం చేస్తారు. తొలిదశ కింద ఈ విద్యా సంవత్సరంలో 2,663 స్కూళ్లను విలీనం చేసినట్లు అధికారులు తెలిపారు.

2,05,071 మంది విద్యార్థులు నూతన విద్యా విధానాన్ని అనుసరించి విలీనమైనట్లు చెప్పారు. మొత్తంగా  ఈ ప్రక్రియలో 9.5 లక్షల మంది విద్యార్థులకు నూతన విద్యావిధానం ఈ సంవత్సరమే అందుబాటులోకి వచ్చిందని వెల్లడించారు. సమీక్షలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుడితి రాజశేఖర్, మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ఏ.ఆర్‌.అనురాధ, స్కూల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ (ఎండీఎం అండ్‌ శానిటేషన్‌) బి.ఎం.దివాన్, మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ డైరెక్టర్‌ కృతికా శుక్లా, సర్వశిక్షా అభియాన్‌ స్టేట్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ వెట్రిసెల్వి, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ వి.చినవీరభద్రుడు, ఏపీఆర్‌ఈఐఎస్‌ సెక్రటరీ వి.రాములు తదితరులు పాల్గొన్నారు. 

ఎయిడెడ్‌పై బలవంతం లేదు
ఎయిడెడ్‌ పాఠశాలలను ప్రభుత్వానికి అప్పగించడం అన్నది పూర్తిగా స్వచ్ఛందమని ముఖ్యమంత్రి జగన్‌ మరోసారి స్పష్టం చేశారు. వివిధ కారణాలతో నిర్వహించలేని పరిస్థితుల్లో ఉన్నవారికి ప్రభుత్వం ఒక అవకాశం మాత్రమే కల్పిస్తుందని చెప్పారు. ఇష్టం ఉన్నవారు స్వచ్ఛందంగా ప్రభుత్వంలో విలీనం చేయవచ్చని లేదంటే యథాప్రకారం నడుపుకోవచ్చన్నారు. విలీనం చేస్తే వారి పేర్లు కొనసాగిస్తామన్నారు. తొలుత విలీనానికి అంగీకరించిన వారు నిర్ణయం మార్చుకుని తామే నిర్వహించుకుంటామంటే నిరభ్యంతరంగా వెనక్కి తీసుకోవచ్చని తెలిపారు. విద్యార్థులకు మంచి సదుపాయాలు, నాణ్యమైన విద్య అందాలన్నదే ప్రభుత్వ ఉద్దేశమని చెప్పారు. ఈ ప్రక్రియలో ఎక్కడా బలవంతం లేదని, అపోహలకు గురి కావద్దని, ఇందులో రాజకీయాలు తగవని సూచించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top