ఎలాంటి కాన్పులైనా అమ్మకు 5,000  

CM YS Jagan High Level Review on Medical and Health Department - Sakshi

వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరాతో తల్లులకు సర్కారు సాయం

సహజ ప్రసవాలు పెరిగేలా వైద్యులు చొరవ చూపాలి: ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌

అవసరాల మేరకు ఆరోగ్యశ్రీ ప్రొసీజర్ల సంఖ్య పెంపు

ఆరోగ్యశ్రీ కింద నెలకు కనీసం రూ.270 కోట్లు వ్యయం

ఆయుష్మాన్‌ భారత్‌తో గతేడాది వచ్చింది రూ.223 కోట్లు మాత్రమే

క్యాన్సర్‌ కట్టడికి మెడికల్‌ కాలేజీల్లో రెండేసి చొప్పున లైనాక్‌ మెషిన్లు 

విశాఖ, తిరుపతి, గుంటూరులో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటుకు ప్రతిపాదన

విలేజ్‌ క్లినిక్స్‌తో ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ సమర్థంగా అమలు 

గ్రామ స్థాయిలోనే క్యాన్సర్‌ కేర్, నివారణ చర్యలు.. స్క్రీనింగ్‌పై సిబ్బందికి శిక్షణ

వైద్య ఆరోగ్యశాఖపై సీఎం ఉన్నతస్థాయి సమీక్ష

సాక్షి, అమరావతి: ఏ తరహా ప్రసవాలు జరిగినా వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా కింద తల్లులకు రూ.ఐదు వేల చొప్పున ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. సహజ ప్రసవమైనా, సిజేరియన్‌ జరిగినా ఈ మొత్తాన్ని అందించాలన్నారు. గతంలో సిజేరియన్‌ జరిగితే రూ.3 వేలే ఇస్తున్నారని, దీన్ని రూ.5 వేలకు పెంచాలని సూచించారు. సహజ ప్రసవమైనా, సిజేరియన్‌ అయినా తల్లీబిడ్డల సంరక్షణ ముఖ్యం కాబట్టి ఒకే మొత్తాన్ని ఇవ్వాలన్నారు.

సహజ ప్రసవాల సంఖ్యను పెంచడంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని అవగాహన, చైతన్యం కల్పించాల్సిన బాధ్యత వైద్యులపై ఉందన్నారు. వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ, వైద్య ఆరోగ్యశాఖలో నాడు–నేడు, కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణం, క్యాన్సర్‌ కేర్, కోవిడ్‌ తదితరాలపై సీఎం జగన్‌ సోమవారం క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ..

ఆరోగ్యశ్రీ  పరిధిలోకి మరిన్ని 
వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ద్వారా అందిస్తున్న చికిత్సలు, వ్యయం వివరాలను సమీక్షలో అధికారులు వివరించారు. ఆరోగ్యశ్రీ పరిధిలోకి 2,446 ప్రొసీజర్లను తెచ్చినట్లు తెలిపారు. దీన్ని నిరంతరం పరిశీలిస్తూ అవసరాల మేరకు ప్రొసీజర్ల సంఖ్యను పెంచాలని సీఎం జగన్‌ నిర్దేశించారు. ఆరోగ్యశ్రీ బిల్లుల చెల్లింపు ప్రక్రియను మరింత పారదర్శకంగా చేపట్టాలని సూచించారు. సంబంధిత రోగికి ఏ వైద్యం అందించారు? చికిత్స కోసం ప్రభుత్వం ఎంత చెల్లిస్తోంది? లాంటి వివరాలను డిశ్చార్జి సమయంలో రోగులకు తెలియచేస్తూ వారి ఆమోదం తీసుకుని పారదర్శకంగా బిల్లులు చెల్లించే విధానంపై వారంలోగా మార్గదర్శకాలు రూపొందించాలని సూచించారు. 

వ్యయం రూ.4 వేల కోట్లు.. వచ్చింది రూ.223 కోట్లు
వైఎస్సార్‌ ఆరోగ్యశ్రీ ద్వారా నెలకు కనీసం రూ.270 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. 104, 108 కోసం ప్రతి నెలా కనీసం రూ.25 కోట్లు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా కింద నెలకు కనీసం మరో రూ.35 కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. కేవలం ఆరోగ్యశ్రీ, సంబంధిత కార్యకలాపాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా దాదాపు రూ.4 వేల కోట్లు వ్యయం చేస్తున్నట్లు పేర్కొన్నారు. గతేడాది ఆయుష్మాన్‌ భారత్‌ కింద రాష్ట్రానికి వచ్చింది రూ.223 కోట్లు మాత్రమేనని స్పష్టం చేశారు. ఇక ఈ ఏడాది రూ.360 కోట్లు రానున్నట్లు అంచనా వేసినట్లు తెలిపారు. 

డిసెంబర్‌కు 4 కొత్త మెడికల్‌ కాలేజీలు
వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్, వార్డు క్లినిక్స్, ఆస్పత్రుల్లో అభివృద్ధి పనులు, కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణాన్ని నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న 16 మెడికల్‌ కాలేజీల పనుల పురోగతిని సీఎం సమీక్షించారు. విజయనగరం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నంలో ఏర్పాటయ్యే కొత్త మెడికల్‌ కాలేజీల్లో 2023 నుంచి ప్రవేశాల కోసం రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

మెడికల్‌ కౌన్సిల్‌ మార్గదర్శకాల ప్రకారం పనులు వేగంగా చేపట్టి నాలుగు కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణం డిసెంబర్‌ నాటికి పూర్తయ్యేలా కృషి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. మిగిలిన చోట్ల కూడా నిర్మాణాలు వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. ఒకటి రెండు చోట్ల స్థలాలపై కోర్టు కేసులున్నట్లు అధికారులు నివేదించగా వీలైనంత త్వరగా పరిష్కారమయ్యేలా చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. పీహెచ్‌సీల్లో 977 చోట్ల అభివృద్ధి పనులు పూర్తయ్యాయని, కొత్తవాటి నిర్మాణం చురుగ్గా సాగుతోందని అధికారులు తెలిపారు.

క్యాన్సర్‌కు ఏడాదిలో 34 వేల మంది బలి
భారత్‌ సహా ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్‌ కేసులు పెరుగుతున్నాయని, 2020లో రాష్ట్రంలో 34 వేల మందిని ఈ మహమ్మారి కబళించినట్లు అధికారులు తెలిపారు. ప్రాథమిక దశలో గుర్తించకపోవడంతో చాలా మరణాలు చోటు చేసుకుంటున్నట్లు చెప్పారు. చివరి దశలో గుర్తించి చికిత్స కోసం భారీగా ఖర్చు చేస్తున్నారని, అప్పటికే పరిస్థితి చేయి దాటిపోతోందని పేర్కొన్నారు.

గ్రామ స్థాయిలోనే క్యాన్సర్‌ కేర్, స్క్రీనింగ్, ప్రివెంటివ్‌ చర్యలు..
విలేజ్‌ క్లినిక్స్‌ స్థాయిలోనే క్యాన్సర్‌ను గుర్తించడంపై దృష్టి సారించాలని సీఎం జగన్‌ సూచించారు. గ్రామాల్లోనే మెరుగైన వైద్యం అందించే లక్ష్యంతో విలేజ్‌ క్లినిక్స్, వార్డు క్లినిక్స్, పీహెచ్‌సీల నిర్మాణాలను డిసెంబర్‌ కల్లా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తద్వారా ఫ్యామిలీ డాక్టర్‌ కాన్సెప్ట్‌ విధానం సమర్థంగా అమలుతో పాటు క్యాన్సర్‌ గుర్తింపు సులభంగా జరుగుతుందన్నారు.

ఈలోగా క్యాన్సర్‌ స్క్రీనింగ్, ప్రివెంటివ్‌ చర్యలపై సిబ్బందికి శిక్షణ ఇప్పించాలని ఆదేశించారు. దీనివల్ల క్యాన్సర్‌ గుర్తింపు నుంచి చికిత్స వరకూ సమర్థవంతమైన వ్యవస్థ ఏర్పాటవుతుందన్నారు. టాటా మెమోరియల్‌ ద్వారా వైద్యులు, సిబ్బందికి శిక్షణ ఇచ్చేలా ఎంవోయూ కుదిరిందని అధికారులు పేర్కొనగా  స్విమ్స్‌ ఆస్పత్రిని కూడా ఇందులో భాగస్వామిగా చేయాలని సీఎం సూచించారు. 

27 మెడికల్‌ కాలేజీల్లో లైనాక్‌ మెషిన్లు 
కొత్తగా ఏర్పాటయ్యే 16 మెడికల్‌ కాలేజీలతో కలిపి మొత్తం 27 వైద్య కళాశాలల్లో క్యాన్సర్‌ నివారణకు రెండేసి చొప్పున లైనాక్‌ మెషిన్లు ఉండేలా బ్లూ ప్రింట్‌ రూపొందించాలని ముఖ్యమంత్రి జగన్‌ ఆదేశించారు. ఇందులో మూడు కాలేజీల్లో విశాఖ, తిరుపతి, గుంటూరులో క్యాన్సర్‌ నివారణకు సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటు చేయాలని అధికారులు ప్రతిపాదించగా పూర్తిస్థాయి ప్రతిపాదనలు సిద్ధం చేసి నివేదిక సమర్పించాలని సీఎం సూచించారు. 

కోవిడ్‌పై అప్రమత్తంగా ఉండాలి
రాష్ట్రంలో కోవిడ్‌ పరిస్థితులు, వ్యాక్సినేషన్‌పై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్షించారు. కోవిడ్‌ పూర్తి నియంత్రణలో ఉన్నప్పటికీ అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. 18 ఏళ్ల లోపువారికి రెండు డోసుల వ్యాక్సినేషన్‌ దాదాపుగా పూర్తైందని అధికారులు తెలిపారు. 15 నుంచి 17 ఏళ్ల లోపు వారికి 99.65 శాతం పూర్తి కాగా 12 నుంచి 14 ఏళ్లలోపు వారికి 97.78 శాతం వ్యాక్సినేషన్‌ జరిగినట్లు వివరించారు.

సమీక్షలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని, సీఎస్‌ సమీర్‌శర్మ, ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, కోవిడ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ వ్యాక్సినేషన్‌ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, స్పెషల్‌ సెక్రటరీ జి.ఎస్‌.నవీన్‌కుమార్, ఆరోగ్యశ్రీ సీఈవో వినయ్‌చంద్, ఏపీఎంఎస్‌ఐడీసీ వీసీ అండ్‌ ఎండీ డి.మురళీధర్‌ రెడ్డి, ఏపీవీవీపీ కమిషనర్‌ వి.వినోద్‌ కుమార్, వైద్య ఆరోగ్యశాఖ డైరెక్టర్‌ (డ్రగ్స్‌) రవిశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top