
విశాఖ: విశాఖలో ఎకరా భూమిని 99 పైసలకే ఇవ్వడానికి ఇవ్వడానికి ఏపీ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందంపై సీఐటీయూ తీవ్రంగా ధ్వజమెత్తింది. దీని వెనుక క్విడ్ ప్రోకో ఉందని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నరసింహారావు మండిపడ్డారు. ‘విశాఖలో ఎకరా భూమి 99 పైసలుకు కట్టబెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం.దీని వెనక క్విడ్ ప్రోకో ఉంది. వేల కోట్ల రూపాయలు విలువ చేసే భూములను ఇష్టానుసారంగా ఇచ్చేస్తున్నారు..
ఎకరా 99 పైసల ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలి. ప్రభుత్వ భూములను 99 పైసలకు ఇచ్చే హక్కు ప్రభుత్వానికి లేదు. ప్రభుత్వ రంగ సంస్థలకు ఎకరా ఐదు కోట్లకు అమ్ముతున్నారు. ప్రైవేట్ సంస్థలకు ఎకరా 99 పైసలుకు ఇస్తున్నారు. వేల కోట్ల విలువైన భూములను కమీషన్లు కోసం తక్కువ ధరకు అమ్మేస్తున్నారు. ఈ అమ్మకాల ద్వారా తమ ఆస్తులను వ్యాపారాలను పెంచుకుంటున్నారు..
ఉర్సా అనే సంస్థ ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. ఆ సంస్థకు 99 పైసలకు ఎకరా ఎందుకు ఇస్తున్నారు అర్థం కావడం లేదు.’ అని సీహెచ్ నరసింహారావు ధ్వజమెత్తారు.