సాక్షి, అమరావతి: అప్పులు చేయడంలో చంద్రబాబు ప్రభుత్వం రికార్డు సృష్టిస్తోంది. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే రూ.7,300 కోట్లు అప్పు తెచ్చి రికార్డులను తిరగరాస్తోంది. మంగళవారమే చంద్రబాబు సర్కారు రూ.3,900 కోట్లు అప్పు చేసింది. ఇప్పుడు మళ్లీ శుక్రవారం మరో రూ.3,400 కోట్లు అప్పు చేస్తోంది. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెక్యూరిటీలను వేలం వేయడం ద్వారా రూ.3,400 కోట్ల అప్పును సమీకరించి ఇవ్వనుంది.
ప్రభుత్వం 14 ఏళ్ల కాల వ్యవధితో రూ.1,000 కోట్లు, 16 ఏళ్ల కాల వ్యవధితో రూ.1,000 కోట్లు, 18 ఏళ్ల కాల వ్యవధితో రూ.1,400 కోట్లు అప్పు చేయనుంది. ఈ మేరకు ఆర్బీఐ నోటిఫై చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు శుక్రవారం చేయనున్న అప్పులను ఆర్బీఐ ఈ నెల 24వ తేదీనే నోటిఫై చేసింది. అయితే ఆ జాబితాలో ఆంధ్రప్రదేశ్ను నోటిఫై చేయలేదు.
చంద్రబాబు ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఏపీ చేయనున్న అప్పులను కూడా ఆర్బీఐ బుధవారం రాత్రి నోటిఫై చేసింది. కాగా, నేడు(శుక్రవారం) చేయనున్న రూ.3,400 కోట్ల అప్పుతో కలిపితే... చంద్రబాబు ప్రభుత్వం కేవలం 22 నెలల్లోనే చేసిన అప్పు రూ.3,40,621 కోట్లకు చేరనుంది. అంటే.. సగటున నెలకు రూ.15,482.77 కోట్లు, రోజుకు రూ.516 కోట్లు అప్పు చేసింది.


