సాక్షి,తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళం పర్యటనపై కూటమి ప్రభుత్వ కుట్రకు దిగింది. వైఎస్ జగన్ పర్యటనకు వస్తే కేసులు పెడతామంటూ బెదిరింపులకు దిగింది. జనం రాకుండా అడ్డుకోవడానికి పోలీసులను రంగంలోకి దించింది. కేవలం 8 వాహనాలకు మాత్రమే అనుమతి ఉందని పోలీసులు ప్రకటించారు. ప్రభుత్వ ఆదేశాలతో శ్రీకాకుళం ఎస్పీ ఆంక్షలు విధించారు.
వైఎస్ జగన్ రేపు (30.07.2026, గురువారం) శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. అక్రమ కేసులో అరెస్టై శ్రీకాకుళం సమీపంలోని అంపోలు జిల్లా జైలులో రిమాండ్లో ఉన్న మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజును ములాఖత్లో కలిసి పరామర్శించనున్నారు.
వైఎస్ జగన్ గురువారం ఉదయం 9 గంటలకు తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరి విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ఉదయం 11 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2 గంటలకు శ్రీకాకుళం సమీపంలోని అంపోలు జిల్లా జైలుకు చేరుకుంటారు. జైలులో డాక్టర్ సీదిరి అప్పలరాజుతో ములాఖత్ అయి, ఆయనను పరామర్శిస్తారు. అక్రమ కేసులు, రాజకీయ వేధింపులకు గురవుతున్న పార్టీ నాయకులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందన్న భరోసాను ఇవ్వనున్నారు. అనంతరం వైఎస్ జగన్ తిరుగు ప్రయాణమవుతారు.


