ప్రజా వ్యతిరేకత పెరిగిన వేళ ప్రజల దృష్టి మళ్లించేందుకు బైజూస్పై సరికొత్తగా విష ప్రచారం
పేదింటి విద్యార్థులకు ప్రపంచ ప్రమాణాలతో బైజూస్ కంటెంట్తో ఉచిత విద్య
అత్యాధునిక శాంసంగ్ ట్యాబ్లో కంటెంట్ నిక్షిప్తం చేసి ఉచితంగా పంపిణీ
దీన్ని ఓర్వలేక చంద్రబాబు తన ఎల్లో మీడియా ద్వారా దు్రష్పచారం
ఏది నిజం?
సాక్షి, అమరావతి: రెండేళ్ల పాలనలో చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఏం చేసిందో చెప్పుకోలేక ఎల్లో మీడియా ద్వారా గత ప్రభుత్వ పాలనపై విషం కక్కుతోంది. ఈ క్రమంలో పేదింటి విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడిన ట్యాబ్ల పంపిణీని తీవ్రంగా తప్పుపట్టింది. పేదింటి విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి విద్యను ఉచితంగా అందించేందుకు వైఎస్ జగన్ ప్రభుత్వంలో తీసుకొచ్చిన బైజూస్ కంటెంట్పై ఏడుపుగొట్టు రాతలు రాస్తోంది. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో సాంకేతిక పరికరాలను రూపొందించే శాంసంగ్ సంస్థ ట్యాబ్లలో ఉచితంగా బైజూస్ కంటెంట్ను అందిచడాన్ని జీర్ణించుకోలేక దుష్ప్రచారం చేస్తోంది.
వాస్తవానికి శాంసంగ్ సంస్థ 8.7 అంగుళాల స్క్రీన్తో ట్యాబ్లను రూపొందిస్తోంది. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఒకే ప్రమాణాలతో తయారు చేస్తోంది. అలాంటి పేరెన్నిక కలిగిన ట్యాబ్లను చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు వైఎస్ జగన్ ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసింది. పైగా అందులో అత్యంత ఖరీదైన గ్లోబల్ కంటెంట్ను (బైజూస్) నిక్షిప్తం చేసి మరీ అందించింది. ఇంతటి విప్లవాత్మక చర్య విద్యా వ్యవస్థలో ఎన్నడూ జరగలేదు. దీన్ని ఓర్వలేని చంద్రబాబు అండ్ కో గతంలోనూ పిల్లలు ట్యాబ్ వాడి చెడిపోతున్నారంటూ తప్పులు రాతలు రాయించి పేదింటి విద్యార్థులను తీవ్రంగా అవమానించింది. ప్రజా వ్యతిరేకత పెరగడంతో ఇప్పుడు మరోసారి అక్కసు వెళ్లగక్కింది.
9 అంగుళాల స్కీన్ర్ పెడితే?
చంద్రబాబు ఎల్లో మీడియా 8.7 అంగుళాక స్క్రీన్ నిబంధన కేవలం ఒక కంపెనీకే లబ్ధి చేకూర్చేందుకు పెట్టారని వింత వాదన తెరపైకి తెచ్చింది. అదే, 9 అంగుళాలు స్క్రీన్ పెట్టినా ఇలాంటి తప్పుడు వాదనే వినిపిస్తుంది. వాస్తవానికి చంద్రబాబు అండ్కోకు పేదింటి బిడ్డలు ఉన్నత ప్రమాణాలతో విద్యను నేర్చుకోవడం నచ్చదు. పేదలు అక్షర జ్ఞానానికి చేరువ అవుతున్న ప్రతిసారీ ‘ఆంగ్లం వద్దు.. తెలుగు ముద్దు’ అంటూ పుక్కిట ఉపన్యాసాలు గుప్పించి వ్యవస్థలను కలుషితం చేసింది. అందుకే జగన్ ప్రవేశపెట్టిన ఆంగ్ల మాధ్యమంపైనా బురదజల్లింది.
అధికారంలోకి వచ్చిన తర్వాత ట్యాబ్ల పంపిణీని ఎత్తేసింది. రెండో ఏడాదికే విద్యార్థి కిట్లు (సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర) పంపిణీ చేయలేమంటూ ఎక్కడో జరుగుతున్న యుద్ధంపైకి నెపాన్ని నెట్టేసి తప్పించుకుంది. డీఎస్సీ నియామకాల అక్రమాలపై నిరుద్యోగ యువత రగలిపోతుంటే కనీసం స్పందించని చంద్రబాబు, ఎల్లో మీడియా.. ఉన్నట్లుండి బైజూస్కు దోచిపెట్టారంటూ అడ్డగోలు కథనం అచ్చేయడం విస్తుగొలుపుతోంది.


