31 మంది టీడీపీ నాయకులపై కేసు | Cases Filed Against 31 TDP Leaders in Andhra Pradesh | Sakshi
Sakshi News home page

31 మంది టీడీపీ నాయకులపై కేసు

May 10 2026 6:18 AM | Updated on May 10 2026 6:18 AM

Cases Filed Against 31 TDP Leaders in Andhra Pradesh

మామిళ్లపల్లిలో త్రివేణి గోదాములో హల్‌చల్‌ చేస్తున్న టీడీపీ నేతలు (ఫైల్‌)

రైతుల గొడౌన్‌పై దాడి ఘటనలో పోలీసుల చర్యలు  

పొన్నూరు: గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మామిళ్లపల్లి గ్రామంలోని రైతుల గొడౌన్‌పై జరిగిన దాడి ఘటనలో 31 మంది టీడీపీ నేతలపై శనివారం కేసు నమోదు చేశారు. రబీలో మొక్కజొన్న సాగు చేసి మద్దతు ధర లేక... ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ అనుచరులైన దళారుల దోపిడీతో నష్టపోతున్న రైతులకు వైఎస్సార్‌సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ అండగా నిలిచారు. రైతులకు ఎమ్మెల్యే చేస్తున్న అన్యాయాన్ని నిలదీస్తూ, మొక్కజొన్నకు మద్దతు ధర కల్పించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఇటీవల కలెక్టర్‌ కార్యాలయం వద్ద దీక్ష చేశారు. 

మురళీకృష్ణపై బురద జల్లాలనే తలంపుతో రైతులు మొక్కజొన్న నిల్వ చేసుకున్న గోదామును మురళీకృష్ణకు చెందినదిగా చిత్రీకరించేందుకు టీడీపీ నాయకులు ప్రయతి్నంచారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే నరేంద్ర ప్రోత్సాహంతో నియోజకవర్గానికి చెందిన టీడీపీ నాయకులు ఈ నెల 5వ తేదీన పొన్నూరు మండలం మామిళ్లపల్లి గ్రామంలో మొక్కజొన్న బస్తాలు నిల్వ చేసుకున్న రైతు సుదా సముద్రయ్య, త్రివేణికి చెందిన గొడౌన్‌పై దాడి చేశారు. షట్టరు పగలగొట్టి అడ్డు వచి్చన రైతులపై విరుచుకుపడ్డారు. సముద్రయ్యపై దాడి చేసి గాయపరిచారు.

అధికారులకు సమాచారమిచ్చి అక్రమ నిల్వలని తేల్చాలని ఒత్తిడి చేశారు. గొడౌన్‌ను సీజ్‌ చేయించేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. జరిగిన నష్టం, దాడి చేసిన వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని కోరుతూ తహసీల్దారు, రూరల్‌ పోలీసు స్టేషన్‌లో రైతు సముద్రయ్య ఫిర్యాదు చేయడంతో...  టీడీపీ పొన్నూరు, పెదకాకాని, చేబ్రోలు మండలాల అధ్యక్షులు బండ్లమూడి బాబూరావు, వలివేటి మురళీకృష్ణ, మైలా వెంకటరాజుతోపాటు ముఖ్య నాయకులు మాదాల వెంకటేశ్వరరావు, బొర్రు రామారావు, ఆరె వరప్రసాద్, షేక్‌.బాజి సాహెబ్, పఠాన్‌ ఫిరోజ్‌ ఖాన్, ఫైజుల్లా ఖాన్, బోయపాటి రామ్మోహన్, దర్శి భాస్కరరావుతోపాటు మరో 22 మందిపై రూరల్‌ ఎస్సై శ్రీహరి వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement