తిరుపతి: టీటీడీ వసతి గదుల వ్యవహారంలో భారీ లోపాలు బయటపడ్డాయని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. టీటీడీ భద్రత, విజిలెన్స్ వ్యవస్థల్లో జవాబుదారీతనం లేకుండా పోయిందని విమర్శించారు. అగోడ (Agoda) యాప్లో టీటీడీ వసతి గదులు విక్రయానికి పెట్టారని ఆరోపించారు. టీటీడీ నిబంధనలకు విరుద్ధంగా గదులను అధిక ధరలకు ఆఫర్ చేస్తున్నారని చెప్పారు. రూ.1,000 నుంచి రూ.1,800 వరకు ఉండే గదులను రూ.18,000 వరకు విక్రయిస్తున్నారని తెలిపారు.
‘‘ఆదిత్య బిర్లా, పాంచజన్యం, వికాస్ నిలయం, వకుళమాత గెస్ట్ హౌస్ల పేర్లు అన్లైన్ విక్రయాలు జరుగుతున్నాయి. కొన్ని గదులను రూ.14,500, రూ.18,180, రూ.20,700 ధరలకు ఆఫర్ చేశారు. నో స్మోకింగ్ రూమ్స్ పేరుతో కూడా ఆన్లైన్లో ప్రకటనలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన యాప్లో టీటీడీ వసతులు కనిపించడం ఆందోళనకరం’’ అని తెలిపారు.
అగోడ యాప్కు సంబంధించి భూమన వీడియో ఆధారాలను విడుదల చేశారు. టీటీడీ లోపాలను ఎత్తిచూపితే తమపై విమర్శలు చేస్తున్నారని తెలిపారు. ‘‘ఇలాంటి అంశాలను గుర్తించడంలో టీటీడీ భద్రతా విభాగం విఫలమైంది. నవనీతమ్మ వ్యవహారంపై సీఎం, టీటీడీ చైర్మన్ చేసిన వ్యాఖ్యలు సరికాదు. వృద్ధురాలికి దర్శనం కల్పించడం తప్పు కాదు. పూర్తి వివరాలు తెలుసుకోకుండా అత్యుత్సాహం ప్రదర్శించారు.
నవనీతమ్మ పేరుతో రాజకీయ ప్రచారం చేసుకోవాలని చూస్తున్నారు. సీఎం, టీటీడీ చైర్మన్ చేసిన ప్రకటనల్లో భిన్న సమాచారం ఉంది. ఈ వ్యవహారంపై సీసీటీవీ ఫుటేజ్ను బహిర్గతం చేయాలి. ప్రపంచవ్యాప్తంగా భక్తులు నకిలీ యాప్ల ద్వారా మోసపోతుంటే చర్యలు ఎందుకు లేవు? వృద్ధురాలి అంశంపై చూపిన చొరవను నకిలీ యాప్ల నియంత్రణపై చూపాలి. మా హయాంలో 48 నకిలీ వెబ్సైట్లపై ఫిర్యాదు చేసి మూసివేయించాం’’ అని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పారు.


