వ్యవసాయ విద్యుత్ పంపిణీకి ప్రత్యేకంగా ఏపీఆర్ఏపీఎల్
కొత్త డిస్కం ఏర్పాటు వల్ల ప్రస్తుత డిస్కంలపై ప్రభావం పడుతుందనే సందేహాలు
ఉద్యోగుల విభజన, పదోన్నతులు, భవిష్యత్తుపై ఉద్యోగ సంఘాల ఆందోళన
నిర్ణయానికి ముందు తమ అభిప్రాయాలు తీసుకోవాలని డిమాండ్
అభ్యంతరాలు, సూచనలకు మరో పది రోజులు గడువు పెంచిన ఏపీఈఆర్సీ
సాక్షి, అమరావతి: వ్యవసాయ అవసరాలకు విద్యుత్ సరఫరా చేయడం కోసం ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ రూరల్ అగ్రికల్చర్ పవర్ లిమిటెడ్(ఏపీఆర్ఏపీఎల్)ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సౌర విద్యుత్ను వ్యవసాయ అవసరాలకు అందించడం కోసం అనుమతి ఇవ్వాల్సిందిగా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ)కి ఏపీఆర్ఏపీఎల్ మే 25న దరఖాస్తు చేసింది.
ఈ ప్రతిపాదనపై ప్రజలు, రైతులు, సంస్థలు అభ్యంతరాలు లేదా సూచనలను జూన్ 11లోపు పంపించాలని ఏపీఈఆర్సీ సూచించింది. అయితే ఈ గడువు సరిపోదని, అగ్రి డిస్కంపై అనేక సందేహాలు, అనుమానాలు ఉన్నాయని, గడువు పెంచాల్సిందిగా ఏపీ విద్యుత్ ఉద్యోగుల సంఘంతో పాటు పలు యూనియన్లు ఏపీఈఆర్సీని అభ్యర్థించాయి. దీంతో ఈ నెల 22 వరకూ గడువు పొడిగించడంతో పాటు ఏపీఆర్ఏపీఎల్ బదులిచ్చేందుకు ఈ నెల 30 వరకూ అవకాశం కల్పిస్తూ ఏపీఈఆర్సీ గురువారం ఆదేశాలు జారీ చేసింది.
నిర్ణయానికి ముందు అందరినీ సంప్రదించాలి..
ఈ కొత్త డిస్కం ఏర్పాటుతో పాటు దానితో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ తూర్పు, మధ్య, దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల ఒప్పందానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆమోదం తెలిపింది. అదే విధంగా వ్యవసాయ ఫీడర్లకు సంబంధించిన 11 కేవీ లైన్లు, డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, లో వోల్టేజ్ లైన్లను దశల వారీగా కొత్త డిస్కంకు బదిలీ చేసేందుకు ఏప్రిల్ 20న ప్రభుత్వం అనుమతినిచ్చింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఏపీఆర్ఏపీఎల్ ఏప్రిల్ 27న రాష్ట్రంలోని మూడు డిస్కంలతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
అయితే ఏపీఆర్ఏపీఎల్కు డీమ్డ్ డిస్ట్రిబ్యూషన్ లైసెన్స్ ఇవ్వాలన్న ప్రతిపాదనపై ఏపీ విద్యుత్ ఉద్యోగుల సంఘంతో పాటు పలు సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ మేరకు ఏపీఈఆర్సీకి లిఖిత పూర్వకంగా ఓ లేఖ కూడా రాశాయి. ఉద్యోగ సంఘాలు చెబుతున్నదాని ప్రకారం.. ఈ ప్రతిపాదన అమలైతే విద్యుత్ పంపిణీ వ్యవస్థలో ఆర్థిక, పరిపాలనా సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ప్రస్తుతం వ్యవసాయ వినియోగదారులకు సేవలందిస్తున్న ఏపీఎస్పీడీసీఎల్, ఏపీసీపీడీసీఎల్, ఏపీఈపీడీసీఎల్పై ప్రభావం పడుతుంది.
వ్యవసాయ విద్యుత్ పంపిణీని వేరే సంస్థకు బదిలీ చేయడం వల్ల డిస్కంల ఆర్థిక పరిస్థితి మరింత క్లిష్టంగా మారే ప్రమాదం ఉంది. అలాగే కొత్త వ్యవస్థ అమల్లోకి వస్తే డిస్కంలలో పనిచేస్తున్న ఉద్యోగులపై ప్రతికూల ప్రభావం పడవచ్చు. ముందుగా సిబ్బంది పునర్విభజన, బదిలీలు, పదోన్నతులు, వేతనాలు, పదవీ విరమణ ప్రయోజనాలపై స్పష్టత ఇవ్వాలని, నిర్ణయం తీసుకునే ముందు ఉద్యోగులు, రైతులు, వినియోగదారుల అభిప్రాయాలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి.


