పరీక్షల్లో ‘తెలుగు’ తప్పనిసరి

Andhra Pradesh SSC Exam 2021: Guidelines for Head Masters - Sakshi

టెన్త్‌ పరీక్షలపై హెచ్‌ఎంలకు సూచనలు

జారీచేసిన ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌

ఇంటర్నల్‌ మార్కులకు ‘నో వెయిటేజి’

సాక్షి, అమరావతి: ఈ ఏడాది జూన్‌లో జరగనున్న పదోతరగతి పబ్లిక్‌ పరీక్షలకు సంబంధించి ప్యాట్రన్‌లో మార్పులు, గ్రూప్‌ కాంబినేషన్లు, నామినల్‌ రోల్స్, ఇతర అంశాలకు సంబంధించి ప్రధానోపాధ్యాయులకు సవివర సూచనలను చేస్తూ ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ ఎ.సుబ్బారెడ్డి బుధవారం సర్క్యులర్‌ విడుదల చేశారు. పరీక్ష పేపర్లు, సమయం, మార్కులు తదితర అంశాలను అందులో వివరించారు. ఈ సర్క్యులర్‌ ప్రకారం.. 

► ఈ పరీక్షలకు తొలిసారి హాజరయ్యే రెగ్యులర్‌ విద్యార్థులంతా తెలుగు భాషను ఫస్ట్‌ లాంగ్వేజ్‌ లేదా సెకండ్‌ లాంగ్వేజ్‌ కిందS తప్పనిసరిగా రాయాలి.
► తెలుగు ఫస్ట్‌ లాంగ్వేజ్‌ పేపర్‌గా ఉన్న విద్యార్థులు సెకండ్‌ లాంగ్వేజ్‌ కింద హిందీ తప్పనిసరిగా రాయాలి.
► ఆంగ్ల మాధ్యమ అభ్యర్థులు ఫస్ట్‌ లాంగ్వేజ్‌గా తెలుగును ఎంచుకుంటే సెకండ్‌ లాంగ్వేజ్‌ పేపర్‌గా హిందీని మాత్రమే ఎంపిక చేసుకోవాలి.

►తమిళం, కన్నడ, ఒరియా తదితర మాతృభాషలను ఫస్ట్‌ లాంగ్వేజ్‌గా ఎంచుకున్న విద్యార్థులు రెండో పేపర్‌గా తెలుగును తప్పనిసరిగా రాయాలి. పబ్లిక్‌ పరీక్షల్లో.. ఇంటర్నల్‌ మార్కులకు వెయిటేజీ ఉండదు.
►ఏడు పేపర్లలో ఫస్ట్‌ లాంగ్వేజ్, సెకండ్‌ లాంగ్వేజ్, థర్డ్‌ లాంగ్వేజ్, మేథమెటిక్స్, సోషల్‌ స్టడీస్‌ పరీక్షలు ఒక్కొక్కటి 100 మార్కులకు ఉంటాయి. ఫిజికల్‌ సైన్సు, బయోలాజికల్‌ సైన్సు పరీక్షలు 50 మార్కుల చొప్పున వేర్వేరుగా ఉంటాయి.

► ఫస్ట్‌ లాంగ్వేజ్‌ కాంపోజిట్‌ పేపర్‌–1.. 70 మార్కులకు, పేపర్‌–2.. 30 మార్కులకు ఉంటాయి.
► లాంగ్వేజ్‌ పరీక్షలు, మేథమెటిక్స్, సోషల్‌ స్టడీస్‌ పరీక్షలు రాసేందుకు ఒక్కో పేపర్‌కు 3 గంటలు, ప్రశ్నపత్రం చదువుకునేందుకు 15 నిమిషాల  (మొత్తం 3 గంటల 15 నిమిషాలు) సమయం ఇస్తారు. 
►ఫిజికల్‌ సైన్సు, బయోలాజికల్‌ సైన్సు పరీక్షలు రాసేందుకు 2.30 గంటలు, ప్రశ్నపత్రం చదువుకునేందుకు 15 నిమిషాలు (మొత్తం 2 గంటల 45 నిమిషాలు) ఇస్తారు.

► 2017 మార్చిలో మొదటిసారి టెన్త్‌ పరీక్షలకు హాజరై 2019 జూన్‌ వరకు ఆ పరీక్షలను పూర్తిచేయనివారు కొత్త స్కీమ్‌లో ప్రస్తుతం నిర్వహించే పరీక్షలకు రిజిష్టర్‌ కావచ్చు.
► ఇంటిపేరుతో సహా అభ్యర్థి పూర్తిపేరు, తండ్రి, తల్లి పూర్తి పేర్లు నమోదు చేయాలి. అనాథలకు సంరక్షకుల పేరు నమోదు చేయాలి.
► స్కూలు రికార్డుల్లో నమోదైన వారిని మాత్రమే రెగ్యులర్‌ అభ్యర్థులుగా పరిగణిస్తారు. 

► గుర్తింపు ఉన్న స్కూలు నామినల్‌ రోల్స్‌ మాత్రమే రెగ్యులర్‌ అభ్యర్థులుగా అప్‌లోడ్‌ చేయాలి.
► చెవిటి, మూగ, అంధత్వం తదితర బహుళ దివ్యాంగులకు రెండు లాంగ్వేజ్‌లకు బదులు ఒక్కటే ఎంచుకోవచ్చు. వీరికి ప్రతి సబ్జెక్టులో పాస్‌ మార్కులు 20 మాత్రమే.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top