నొయిడాలోనూ కాదంబరి ‘హనీ ట్రాప్‌’ | Amit Singh: Mumbai Actress Kadambari Jatwani on Case | Sakshi
Sakshi News home page

నొయిడాలోనూ కాదంబరి ‘హనీ ట్రాప్‌’

Oct 1 2024 4:35 AM | Updated on Oct 1 2024 5:20 AM

Amit Singh: Mumbai Actress Kadambari Jatwani on Case

స్థిరాస్తి వ్యాపారి అమిత్‌ సింగ్‌పై వలపు వల 

స్థిరాస్తి వ్యాపారం చేద్దామంటూ పరిచయం.. అప్పు పేరుతో డబ్బు వసూలు 

రూ.75 లక్షలు ఇవ్వకపోతే రేప్‌ కేసు పెడతానని బెదిరింపులు 

రూ.32 లక్షలు ఇచ్చిన అమిత్‌.. ఇంకా రూ.38 లక్షలు ఇవ్వాలని 

బ్లాక్‌మెయిలింగ్‌.. ఇవ్వకపోతే మాఫియాతో దాడి చేయిస్తామని బెదిరింపు 

పోలీసులకు ఫిర్యాదు చేసిన అమిత్‌ సింగ్‌ 

కాదంబరి, ఆమె తల్లి, తండ్రి, సోదరుడు, మరొకరిపై కేసు నమోదు  

సాక్షి, అమరావతి : వలపు వల (హనీ ట్రాప్‌) విసిరి బడా బాబులను బురిడీ కొట్టించే ‘కిలేడీ’ కాదంబరి జత్వానీ మరో బ్లాక్‌మెయిల్‌ బాగోతం వెలుగు చూసింది. హనీట్రాప్, ఫోర్జరీ పత్రాలతో మోసం, బ్లాక్‌మెయిలింగ్‌ ద్వారా అక్రమ సంపాదనే జీవన విధానంగా చేసుకున్న కాదంబరి జత్వానీ ఢిల్లీ శివారులోని నొయిడాకు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి అమిత్‌సింగ్‌ను బ్లాక్‌ మెయిల్‌ చేసి భారీ మొత్తాన్ని వసూలు చేసింది. అక్కడితో ఆగకుండా ఆయన నుంచి మరింతగా డబ్బు గుంజడానికి వేధింపులకు గురి చేసింది. మాఫియాతో సంబంధాలున్నాయని చెప్పి మరీ అమిత్‌ సింగ్‌ను బెదించింది. బాధితుడు అమిత్‌ సింగ్‌ ఫిర్యాదుతో నొయిడా పోలీసులు కాదంబరి జత్వానీ ప్రథమ నిందితురాలిగా కేసు నమోదు చేశారు. ఆమె తల్లిదండ్రులు, సోదరుడిపైనా కేసు నమోదు చేశారు. సెక్షన్లు 386, 388, 467, 468, 471, 120–బి, 34 కింద ఈ ఏడాది జనవరిలో అభియోగాలు నమోదు చేశారు.

రేప్‌ చేశావని కేసు పెడతా... మాఫియాతో అంతం చేయిస్తా
నొయిడాకు చెందిన అమిత్‌సింగ్‌ను కా­దం­బరి జత్వానీ సోదరు­డు అంబరీష్‌ దుబా­యి­లో కలిసి పరిచయం చేసుకున్నారు. తనకు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులతో సంబంధాలున్నాయని, మోడలింగ్, సినీ రంగంలో ఉన్న తన సోదరి కాదంబరి రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారమూ చేస్తుందని చెప్పారు. అమిత్‌ సింగ్‌ భారత్‌కు తిరిగి వచ్చిన తరువాత ఆయనకు కాదంబరి ఫోన్‌ చేసింది. విలువైన భూములు, ఇతర స్థిరాస్తులు అమ్మకానికి ఉన్నాయని చెప్పి పరిచయం పెంచుకుంది.

ఆ తర్వాత అమిత్‌ సింగ్‌ను కలవాలని చెప్పింది. ‘నేను చూపించే స్థిరాస్తులు నచ్చినా నచ్చకున్నా తన సాంగత్యం కచ్చితంగా నచ్చుతుంది’ అని ఆమె ఆయనతో అన్నది. తరువాత ఓ రెస్టారంట్‌లో అమిత్‌సింగ్‌ను కలిసి స్థిరాస్తుల విషయాలకంటే ఇతర వ్యవహారాలపైనే ఎక్కువగా మాట్లాడింది. అమిత్‌ సింగ్‌తో సెల్ఫీలు తీసుకుంది. తరువాత సాంకేతిక కారణాలతో తన బ్యాంక్‌ ఖాతాలు ఫ్రీజ్‌ అయ్యాయని చెప్పి ఆయన నుంచి అప్పు పేరుతో కొంత డబ్బు తీసుకుంది. 

ఆ తర్వాత కొన్నాళ్లకు రూ.75 లక్షలు ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. అందుకు అమిత్‌సింగ్‌ సమ్మతించకపోవడంతో బెదిరింపులకు దిగింది. తనను అత్యాచారం చేశావని, అసహజ రీతిలో లైంగిక వాంఛలు తీర్చమని వేధించినట్టు పోలీసులకు ఫిర్యాదు చేస్తానని బెదిరించింది. దాంతో భయపడిన అమిత్‌సింగ్‌ కాదంబరికి పలు వాయిదాల్లో రూ.32 లక్షలు ఇచ్చారు. అయినా మరో రూ.38 లక్షలు ఇవ్వాలని బెదిరించారు. ఆమె తల్లి, తండ్రి కూడా డబ్బుల కోసం బెదిరించారు. కాదంబరి సోదరుడు అంబరీష్‌ కూడా నొయిడా వచ్చి మిగిలిన రూ.38 లక్షలు ఇవ్వకపోతే మాఫియాతో దాడి చేయిస్తానని హెచ్చరించారు.

దీంతో బెంబేలెత్తిన అమిత్‌ సింగ్‌ నోయిడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను కాదంబరికి వివిధ సందర్భాల్లో చెల్లించిన రూ.32 లక్షలు, ఆమె ఆ మొత్తాన్ని డ్రా చేసుకున్నట్టు ఆధారాలను కూడా సమర్పించారు. దాంతో పోలీసులు  కాదంబరి జత్వానీ, ఆమె తండ్రి నరేంద్ర కుమార్‌ జత్వానీ, తల్లి ఆశా జత్వానీ, సోదరుడు అంబరీష్‌ జత్వానీతో పాటు బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడిన మరో వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement