స్వల్ప వేతన జీవులే సింహభాగం! | 68 percent of people in the country are salaried below Rs20 thousand | Sakshi
Sakshi News home page

స్వల్ప వేతన జీవులే సింహభాగం!

Aug 17 2024 4:45 AM | Updated on Aug 17 2024 4:45 AM

68 percent of people in the country are salaried below Rs20 thousand

దేశంలో 68 శాతం మంది రూ.20 వేలలోపు జీతగాళ్లే..

సాక్షి, అమరావతి: దేశంలో ఉద్యోగుల జీతాలు అరకొరగానే ఉంటున్నాయని సాక్షాత్తూ కేంద్ర ప్రభుత్వమే వెల్లడించింది. దేశంలో నెల జీతం మీద ఆధారపడుతున్న వారిలో దాదాపు 68 శాతం మంది నెలకు రూ.20 వేల లోపు జీతగాళ్లేనని కూడా తెలిపింది. కేంద్ర గణాంక శాఖ ‘పీరియాడిక్‌ లేబర్‌ ఫోర్స్‌ సర్వే(పీఎల్‌ఎఫ్‌ఎస్‌) తాజా నివేదిక దేశవ్యాప్తంగా నిరుద్యోగిత పెరుగుతోందని కూడా పేర్కొంది. ఉద్యోగుల జీతాలపై కీలక అంశాలను వెల్లడించింది. 

దేశంలో ప్రభుత్వ, ప్రైవేటు, అసంఘటిత రంగాల్లో కలిపి దేశం మొత్తం మీద 8.50 కోట్ల మంది నెల జీతం మీద ఆధారపడి జీవిస్తున్నారని ఆ నివేదిక తెలిపింది. దేశంలో నెలకు రూ.70 వేలకు పైగా జీతం తీసుకుంటున్నవారు కేవలం 2.6 శాతం మందే ఉన్నారంది. అలాగే, దేశంలో నిరుద్యోగిత క్రమంగా పెరుగుతోందని పీఎల్‌ఎఫ్‌ఎస్‌ నివేదిక తెలిపింది. దేశంలో 27 రంగాల్లో ఉద్యోగ కల్పన పరిస్థితులను విశ్లేషించి నివేదిక వెల్లడించింది. 

ఆ ప్రకారం 2022–23 కంటే 2023–24లో దేశంలో 4.66 కోట్ల మంది నిరుద్యోగులు పెరిగారు. 2022–23లో దేశంలో 59.67 కోట్ల మంది నిరుద్యోగులు ఉండగా... 2023–24లో 64.33 కోట్లకు చేరారు. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత 1 శాతం తగ్గగా.. గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం నిరుద్యోగిత 3శాతం పెరిగింది.  

Advertisement
 
Advertisement
Advertisement