గుత్తి: స్థానిక ఆర్ఎస్లోని చంద్ర ప్రియనగర్లో శనివారం తెల్లవారు జామున చోరీ జరిగింది. కాలనీలో నివాసముంటున్న భాగ్యలక్ష్మి ఇంటికి తాళం వేసి పాతకొత్తచెరువుకు వెళ్లారు. తాళం వేసిన ఇంటిని గమనించిన ఐదుగురు దుండగులు దర్జాగా కారులో వచ్చి భాగ్యలక్ష్మి ఇంటి తాళం తెరిచి లోపలకు ప్రవేశించి బీరువాలోని రూ. 5 వేల నగదు, 30 తులాల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. గమనించిన కాలనీ వాసులు అడ్డుకోబోగా కారులో ఉడాయించారు. ఈ దృశ్యాలు సీసీ కెమెరా ఫుటేజీల్లో నిక్షిప్తమయ్యాయి. కాలనీవాసులు వెంట పడినా డ్రైవర్ కారు ఆపకుండా మూడు రౌండ్లు గిరగిరా తిప్పి శరవేగంగా దూసుకెళ్లిపోవడం గమనార్హం. బాధితురాలి ఫిర్యాదు మేరకు శనివారం రాత్రి పోలీసులు కేసు నమోదు చేసి, సీసీ కెమెరా ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.


