● మాజీ ఎంపీ తలారి రంగయ్య
కళ్యాణదుర్గం రూరల్: రాజకీయ కక్ష సాధింపుల్లో భాగంగా వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలపై బనాయించిన అక్రమ కేసులను తక్షణమే ఎత్తి వేయాలని మాజీ ఎంపీ, కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త తలారి రంగయ్య డిమాండ్ చేశారు. ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఆ సమయంలో కళ్యాణదుర్గంలో తలారి రంగయ్య ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ శ్రేణులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ఈ ర్యాలీకి అనుమతి లేదంటూ వంద మందికి పైగా వైఎస్సార్సీపీ నేతలపై పోలీసులు అక్రమంగా కేసులు బనాయించారు. ఈ క్రమంలో కేసులు నమోదైన పార్టీ నేతలతో కలిసి శుక్రవారం స్థానిక పీఎస్కు రంగయ్య చేరుకుని సంతకం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. విపత్కర పరిస్థితుల్లో ఉన్న ఆర్డీటీ పరిరక్షణకు చిత్తశుద్ధితో శాంతియుత పోరాటాలు సాగించిన తనపై పోలీసులు అక్రమంగా మూడు కేసులు బనాయించారని గుర్తు చేశారు. పార్టీ కోసం ఉత్సాహంగా పనిచేస్తున్న గ్రామస్థాయి కార్యకర్తలపై కూడా అక్రమంగా కేసులు నమోదు చేశారన్నారు. అసలు విజయోత్సవ ర్యాలీలో పాల్గొనని వారిపై 20మందిపై కూడా కేసులు నమోదు చేశారని, అధికార పార్టీ దుర్మార్గానికి ఇది నిదర్శనమన్నారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా... వైఎస్సార్సీపీ నేతలపై బనాయించిన అక్రమ కేసులు ఎత్తి వేయాలని డిమాండ్ చేశారు. అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయాల్సిన ఎయిమ్స్ ఆస్పత్రిని మంత్రి లోకేష్ తన స్వార్థం కోసం తన సొంత నియోజకవర్గమైన మంగళగిరికి తరలించడం దారుణమన్నారు. ఎయిమ్స్ని అనంతపురంలోనే నెలకొల్పాలని డిమాండ్ చేశారు. నియోజకవర్గ వ్యాప్తంగా నెలకొన్న తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. సత్యసాయి తాగునీటి పథకం కార్మికుల సమస్యల పరిష్కారానికి వైఎస్సార్సీపీ తరఫున పోరాటాలు సాగిస్తామని కార్మికులకు ఆయన భరోసానిచ్చారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి బోయ తిప్పేస్వామి, ఎంపీపీలు మారుతమ్మ, చంద్రశేఖర్రెడ్డి, భీమేష్, కమల నాగరాజు, జెడ్పీటీసీ బొమ్మన్న, జిల్లా అధికార ప్రతినిధి శ్రీనివాసులు, నాయకులు సుధీర్, గోళ్ల సూరి, చంద్రశేఖర్రెడ్డి, హనుమంతరాయుడు, ఎంఎస్ రాయుడు, దొడగట్ట నారాయణ, తిరుమల వెంకటేశులు, ముకలనూరు తిమ్మరాయుడు, రామాంజనేయులు, నారాయణపురం వెంకటేశులు, బిక్కి నాగలక్ష్మి, సోమనాథరెడ్డి, గణేష్, నరేంద్రరెడ్డి, రామ్మోహన్, అశోక్రెడ్డి, టైగర్ వన్నూరుస్వామి, మిద్దే సుధాకర్, షెక్షావలి, బిక్కి హరి, టైలర్శీన, దేవా, అంజి, మల్లి, పాతలింగ, తదితరులు పాల్గొన్నారు.


