అసంబద్ధ జీఓలు రద్దు చేసే వరకూ ఉద్యమం | - | Sakshi
Sakshi News home page

అసంబద్ధ జీఓలు రద్దు చేసే వరకూ ఉద్యమం

May 15 2026 10:44 AM | Updated on May 15 2026 10:44 AM

నోటీసులిచ్చిన పీఏసీఎస్‌ ఉద్యోగులు

అనంతపురం అగ్రికల్చర్‌: ఉద్యోగుల హక్కులు కాలరాసేలా చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేసిన అసంబద్ధ జీఓలను రద్దు చేసేవరకూ తమ ఉద్యమం కొనసాగుతుందని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్‌) నాయకులు స్పష్టం చేశారు. ఈ మేరకు యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు ఆర్‌.శ్రీనివాసులు, అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ పి.హనుమంతరెడ్డి, ప్రధాన కార్యదర్శి డి.శ్రీనివాసులు, కోశాధికారి ఎం.హనుమంతరెడ్డి తదితరులు సహాయ నిరాకరణ కొనసాగిస్తామంటూ జేఏసీ తీర్మానించిన నోటీసు ప్రతులను గురువారం డీసీసీబీ చైర్‌పర్సన్‌ ముంటిమడుగు కేశవరెడ్డి, సీఈఓ కె.సురేఖారాణి, జిల్లా సహకార అధికారి ఈ.అరుణకుమారికి అందజేశారు. తమ న్యాయబద్ధమైన డిమాండ్ల సాధనకు గత 22 నెలలుగా పలు రూపాల్లో నిరసనలు, ఆందోళనలు, నిరవధిక సమ్మె కొనసాగించామని గుర్తు చేశారు. ఈ క్రమంలో న్యాయం చేస్తామంటూ రాష్ట్ర సహకార శాఖ మంత్రి అచ్చెన్నాయుడు హామీ ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందన్నారు. కంటితుడుపుగా జీఓలు 112, 322 విడుదల చేసి ఉద్యోగులకు అన్యాయం చేశారని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు తమ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇందులో భాగంగా అన్ని సహకార సంఘాల్లో ‘డే ఎండ్‌, ఆడిట్‌ వర్క్‌, ఇయర్‌ ఎండ్‌’ ప్రాసెస్‌ చేయకుండా నిలిపివేస్తామని స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement