ఉరవకొండ రూరల్: పెన్నహోబిలం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం నృసింహస్వామి సూర్యప్రభ వాహనాన్ని అధిరోహించి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం స్వామి వారి మూలవిరాట్కు ప్రత్యేక అభిషేకాలు, అర్చనలు, పూజల అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. శ్రీదేవి భూదేవి సమేత నృసింహస్వామి ఉత్సవమూర్తులను శోభాయమానంగా అలంకరించిన సూర్యప్రభ వాహనంపై కొలువుదీర్చి ఆలయం చుట్టూ ఊరేగించారు. ఉభయదారులుగా అనంతపురం అంబేడ్కర్నగర్కు చెందిన ఎం. నారాయణ స్వామి కుమారులు వ్యవహరించారు. సాయంత్రం స్వామి వారు ఐరావత వాహనంపై విహరించారు. కార్యక్రమానికి పెద్దముష్టూరు గ్రామానికి చెందిన నెట్టెం జయచంద్ర, నెట్టెం ఎర్రిస్వామి సోదరులు ఉభయదారులుగా వ్యవహరించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ సాకే రమేష్ బాబు, కమిటీ చైర్మన్ రేగాటి నాగరాజు పాల్గొన్నారు.
నేడు నూతన కోర్టుల ప్రారంభం
కళ్యాణదుర్గం/అనంతపురం: జిల్లాలోని కళ్యాణదుర్గం, రాయదుర్గంలో నూతనంగా ఏర్పాటు చేసిన అదనపు సివిల్ జడ్జి (జూనియర్ డివిజన్) కోర్టులను బుధవారం ప్రారంభించనున్నారు. ఉదయం 10 గంటలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జస్టిస్ లీసా గిల్ వర్చువల్గా కోర్టులను ప్రారంభిస్తారని ప్రిన్సిపల్ జిల్లా జడ్జి ఈ.భీమా రావు తెలిపారు. కళ్యాణదుర్గంలో 1వ అదనపు సివిల్ జడ్జి కోర్టు, 2వ అదనపు సివిల్ జడ్జి కోర్టు, రాయదుర్గంలో అదనపు సివిల్ జడ్జి కోర్టులను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.


