చాపట్లలో కౌలు రైతు ఆత్మహత్య | - | Sakshi
Sakshi News home page

చాపట్లలో కౌలు రైతు ఆత్మహత్య

May 6 2026 8:25 AM | Updated on May 6 2026 8:25 AM

రాప్తాడు రూరల్‌: అప్పులు తీర్చే మార్గం కానరాక ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన మేరకు.. కణేకల్లు ప్రాంతానికి చెందిన తలారి నరసింహులు (41) రాప్తాడు మండలం చాపట్లలో వివాహం చేసుకుని అక్కడే స్థిరపడ్డాడు. కొన్నేళ్లుగా మూడు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ ఏడాది టమాట, వేరుశనగ పంటలు సాగు చేసినా... ఆశించిన దిగుబడి రాకపోవడం కుదేలయ్యాడు. పంటల కోసం చేసిన అప్పులకు వడ్డీల భారం పెరుగుతుండగా తీర్చే మార్గం కానరాక మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం తన పొలం వద్దే పంటకు వినియోగించే మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఆయనకు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబానికి అండగా ఉన్న నరసింహులు మరణించడం వారిని పూర్తిగా కుదేలు చేసింది. ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కాగా మృతుడి బంధువులు రాత్రి రాప్తాడు పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement