రాప్తాడు రూరల్: అప్పులు తీర్చే మార్గం కానరాక ఓ కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు తెలిపిన మేరకు.. కణేకల్లు ప్రాంతానికి చెందిన తలారి నరసింహులు (41) రాప్తాడు మండలం చాపట్లలో వివాహం చేసుకుని అక్కడే స్థిరపడ్డాడు. కొన్నేళ్లుగా మూడు ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ ఏడాది టమాట, వేరుశనగ పంటలు సాగు చేసినా... ఆశించిన దిగుబడి రాకపోవడం కుదేలయ్యాడు. పంటల కోసం చేసిన అప్పులకు వడ్డీల భారం పెరుగుతుండగా తీర్చే మార్గం కానరాక మానసిక ఒత్తిడికి లోనయ్యాడు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం తన పొలం వద్దే పంటకు వినియోగించే మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ కన్నుమూశాడు. ఆయనకు భార్య, ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుటుంబానికి అండగా ఉన్న నరసింహులు మరణించడం వారిని పూర్తిగా కుదేలు చేసింది. ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. కాగా మృతుడి బంధువులు రాత్రి రాప్తాడు పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేశారు.


