అనంతపురం అర్బన్: నేషనల్ టెస్టింగ్ ఏజెన్నీ (ఎన్టీఏ) ఆదివారం నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) జిల్లాలో సజావుగా జరిగింది. పరీక్షకు విద్యార్థుల హాజరు 96.62 శాతం నమోదైంది. అనంతపురం నగర పరిధిలోని ఆరు కేంద్రాల్లో, గుత్తి పట్టణ పరిధి లోని రెండు కేంద్రాల్లో పరీక్ష నిర్వహించారు. వేసవి తీవ్రత దృష్ట్యా కేంద్రాల వద్ద తాగునీరు, వైద్య సదుపాయం కల్పించారు. విద్యార్థులు ఉక్కపోతకు గురికాకుండా పరీక్ష కేంద్రాల్లో ఫ్యాన్లు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకున్నారు. పరీక్షకు 3,616 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా 3,494 మంది హాజరయ్యారు. 122 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను నీట్ నోడల్ అధికారి, డీఆర్ఓ ఎ.మలోల సందర్శించారు. పరీక్ష జరుగుతున్న తీరును పరిశీలించారు. మౌలిక సదుపాయాల కల్పనలో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా అని అధికారులను అడిగారు.
హాజరు 96.62 శాతం నమోదు


