శింగనమల: ప్రమాదంలో మృతి చెందిన పదో తరగతి విద్యార్థి పరీక్షల్లో 488 మార్కులతో ఉత్తీర్ణత సాధించాడు. వివరాల్లోకి వెళితే.. శింగనమల మండలం చక్రాయిపేట గ్రామానికి చెందిన శర్మస్వలి (16) గత నెల 21న చోటు చేసుకున్న ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. శర్మస్ వలి సి.బండమీదపల్లిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతూ మార్చిలో శింగనమల సెంటర్లో పరీక్షలు రాశాడు. గురువారం ఫలితాలు వెలువడ్డాయి. 488 మార్కులు సాధించాడని తెలుసుకున్న తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు.
టెన్త్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం
యాడికి: మండలంలోని నిట్టూరు గ్రామానికి చెందిన వెంకటరమణ కుమార్తె అపర్ణ గురువారం ఆత్మహత్యకు యత్నించింది. పదో తరగతిలో అన్ని సబ్జెక్ట్లూ ఉత్తీర్ణత సాధించిన ఆమె సైన్స్ సబ్జెక్ట్లో మాత్రం 34 మార్కులే రావడంతో ఫెయిల్ అయింది. దీంతో మనస్తాపానికి గురై పురుగుల మందు తాగింది. గుర్తించిన కుటుంబసభ్యులు వెంటనే అనంతపురం తరలించారు.


