● ఇన్చార్జ్ డీఎంహెచ్ఓకు ఏపీ ఎన్జీఓ ఉద్యోగుల వినతి
అనంతపురం: వైద్య, ఆరోగ్య శాఖలో ఆప్కాస్ కింద పనిచేస్తున్న 12 మంది ఎఫ్ఎన్ఓ, శానిటరీ వర్కర్లు, అటెండర్లకు ఆరు నెలలుగా జీతాలు చెల్లించడం లేదని, తక్షణమే జీతం బకాయిలు చెల్లించాలంటూ ఏపీ ఎన్జీఓ శాఖ ఆధ్వర్యంలో డీఎంహెచ్ఓ కార్యాలయం ఎదుట బుధవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు జక్కల మాధవ మాట్లాడారు. ఎఫ్ఎన్ఓ, ఎంఎన్ఓ కేడర్ ఉద్యోగులకు సంబంధించి మూడు నెలలు పెండింగ్లో ఉన్న జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే ఆప్కాస్ ఉద్యోగుల్లో 12 మందికి ఆరు నెలలుగా జీతాలు చెల్లించలేదన్నారు. వెంటనే జీతాలు చెల్లించేలా అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు ఉద్యోగులకు నిధి పోర్టల్ ద్వారా త్వరితగతిన వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళా ఉద్యోగులకు మెటర్నటీ లీవ్లను మంజూరు చేసి నెలవారీ జీతాలను జాప్యం లేకుండా చెల్లించాలన్నారు. మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులను సకాలంలో చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని, వెంటనే సమస్య పరిష్కారానికి చొరవ తీసుకోవాలని కోరారు. అనంతరం ఇన్చార్జ్ డీఎంహెచ్ఓ శ్రీనివాసరెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏపీ ఎన్జీఓ సహా అధ్యక్షుడు చంద్రమోహన్, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీధర్ బాబు, కోశాధికారి ప్రవీణ్ కుమార్, ఉమెన్ వింగ్ చైర్పర్సన్ జమీలాబేగం, సుదర్శనశర్మ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు హరికృష్ణ, శ్రీనివాసరెడ్డి, శరత్, మధుబాబు, ఆప్కాస్ కాంట్రాక్ట్, రెగ్యులర్ ఉద్యోగులు పాల్గొన్నారు.


