● బీసీ కార్పొరేషన్ ఈడీ సుబ్రహ్మణ్యం బాధ్యతల స్వీకరణ
అనంతపురం ఎడ్యుకేషన్: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగుల ఉద్యోగ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచిన సంగతి తెలిసిందే. అయితే ఈ నిబంధన కార్పొరేషన్ ఉద్యోగులకు వర్తించకపోవడంతో ఓ అధికారి తనకు అన్యాయం జరిగినట్లుగా భావిస్తూ హైకోర్టును ఆశ్రయించి, తిరిగి పోస్టింగ్ పొందారు. వివరాల్లోకి వెళితే.. బీసీ కార్పొరేషన్ ఈడీగా పనిచేసిన సుబ్రహ్మణ్యం 60 ఏళ్లకు ఉద్యోగ విరమణ పొందారు. అయితే శ్రీఇతర ప్రభుత్వ ఉద్యోగులకు 62 ఏళ్లు ఉంటే, తనకు మాత్రం ఎందుకు వర్తించదు?శ్రీ అంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ఆయనకు అనుకూలంగా హైకోర్టు స్టే మంజూరు చేసింది. అయినా పరిస్థితి అక్కడితో సర్దుకోలేదు. స్టే ఉన్నా.. ఆయనను విధుల్లో కొనసాగనివ్వకుండా ఇంటికి పంపించడంతో వివాదం మరింత ముదిరింది. దీంతో సుబ్రహ్మణ్యం కంటెమ్ట్ పిటిషన్ వేసి మరోసారి న్యాయపోరాటం ప్రారంభించారు. ఈ పరిణామాల మధ్య ప్రభుత్వం కూడా తన నిర్ణయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. చివరకు కోర్టు ఆదేశాలు, న్యాయపరమైన ఒత్తిళ్ల నేపథ్యంలో సుబ్రహ్మణ్యంను మళ్లీ విధుల్లోకి తీసుకోవాల్సి వచ్చింది. ఈక్రమంలో బుధవారం ఆయన తిరిగి బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికే ఆర్నెళ్లు గడిచిపోయాయి. మరో 16 నెలల పాటు సేవలందించే అవకాశం లభించింది. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యంను ఇన్చార్జ్ ఈడీ రామసుబ్బారెడ్డి, కార్యాలయ ఉద్యోగులు రాజు, వెంకటేశు, శంషాద్బేగం, అనసూయమ్మ, యల్లప్ప, రవి అభినందనలు తెలిపారు.


