అనంతపురం అర్బన్: ఉపాధి హామీ కూలీలను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం విఫలమైందని వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు బి.యోగేంద్రరెడ్డి విమర్శించారు. సంఘం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా యోగేంద్రరెడ్డి మాట్లాడారు. 2025 డిసెంబరు నుంచి కూలీలకు వేతనాలు చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. బకాయిపడిన వేతనాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. కూలీలకు సమృద్ధిగా పనులు కల్పించాలన్నారు. పని ప్రాంతంలో నీరు, నీడ, మందుల సదుపాయం కల్పించాలన్నారు. కూలీలు అడిగిన వెంటనే పనులు కల్పించి వలసలు ఆపాలన్నారు. నకిలీ మస్టర్లను అరికట్టాలన్నారు. ఉపాధి హామీ పనుల్లో వెలుగుచూసిన అవినీతిపై తక్షణం చర్యలు తీసుకోవాలన్నారు. కూలీల సమస్యలు పరిష్కరించి ఆదుకునే వరకూ ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం కలెక్టర్ ఆనంద్ను కలిసి డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని నాయకులు అందజేశారు. కార్యక్రమంలో పార్టీ పీఆర్ విభాగం ఉపాధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు నాగేంద్రరెడ్డి, బి.కిరణ్కుమార్, హంపారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సీవీ రంగారెడ్డి, ఉరవకొండ, తాడిపత్రి, అనంతపురం అధ్యక్షులు ఏసీ రంగారెడ్డి, యోగేశ్వరరెడ్డి, విజయకుమార్, జిల్లా కార్యదర్శి జగదీష్, నాయకులు గుత్తి చంద్ర, ఉరవకొండ రామకృష్ణ, అనంతపురం షేక్బీ, తదితరులు పాల్గొన్నారు.
ధర్నాలో వైఎస్సార్సీపీ పంచాయతీ రాజ్ విభాగం నాయకులు


