తలుపుల: మండలంలోని బండ్లపల్లిలో ఓబుళేశ్వరస్వామి రూపంగా కొలిచే దేవర ఎద్దు వేల్పు ఉత్సవం ఆదివారం వైభవంగా ముగిసింది. ఈ వేల్పుకు 11 నాణేలుగా పిలువబడే ఇద్దరు చౌడమ్మలు, ఎల్లమ్మతో పాటు కదిరి చుట్టు పక్కల ప్రాంతాల నుంచి వచ్చిన 8 దేవర ఎద్దులు బాజా భజంత్రీలతో వచ్చారు. నాలుగేళ్ల క్రితం దేవర ఎద్దు చనిపోయింది. గత ఏడాది తూపల్లిలో ఎద్దుల కోపు పెట్టి పూజా కార్యక్రమంలో బియ్యం బేడలు తిన్న లేగ దూడను ఓబుళేశ్వరస్వామి స్వరూపంగా గుర్తించారు. అప్పటి నుంచి ఇలకాపులు, భక్తులు దేవర ఎద్దు వేల్పు ఏర్పాట్లకై సహకారం అందిస్తున్నారు. ఆదివారం వారందరూ బండ్లపల్లికి రావడంతో పండుగ వాతావరణం నెలకొంది. ఇరవై ఏళ్ల తర్వాత ఇంత ఘనంగా కార్యక్రమం జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఉదయం నుంచి ఓబుళేశ్వరస్వామి స్వరూపంగా భావించే దేవర ఎద్దుతో కల్యాణం నిర్వహించి 11 నాణేలతో ఆశీర్వాదం తీసుకొని పసుపును దేవర ఎద్దుపై చల్లుతూ పొదిలో వదిలారు. వచ్చే శనివారం దేవర ఎద్దుకు ముద్రవేసి గ్రామ స్వరూప దేవతగా దేవర ఎద్దును బహిరంగంగా వదిలేస్తారు.


