అనంతపురం: శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ రెక్టార్గా ప్రొఫెసర్ బి.అనిత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఎంబీఏ విభాగానికి అనిత గతంలో ఇన్చార్జ్ వీసీగా వ్యవహరించారు. రెక్టార్గా బాధ్యతలు స్వీకరించిన ఆమెను బోధన, బోధనేతర సిబ్బంది, టైం స్కేల్, మినిమం స్కేల్, హాస్టల్ సిబ్బంది అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో సీడీసీ డీన్, పీఆర్వో ఆచార్య కె.రామగోపాల్ పాల్గొన్నారు.
బొందలవాడలో చోరీ
శింగనమల: నార్పల మండలం బొదలవాడ గ్రామంలోని ఆదివారం రాత్రి చోరీ జరిగింది. గ్రామంలోని ఎస్సీ కాలనీలో నివాసముంటున్న సాకే రామకృష్ణకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో అనంతపురంలో చికిత్స పొందుతున్నాడు. దీంతో కుటుంబసభ్యులు ఆదివారం ఇంటికి తాళం వేసి ఆస్పత్రికి వెళ్లారు. అదే రోజు రాత్రి ఇంట్లోకి చొరబడిన దుండగులు మూడు తులాల బంగారం, 20 తులాల వెండి, రూ.1.20 లక్షల నగదు అపహరించారు. సోమవారం ఉదయం చోరీ విషయాన్ని గుర్తించిన కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు నార్పల పోలీసులు కేసు నమోదు చేశారు.
తుళువ నరసనాయకుడి శాసనం గుర్తింపు
ఉరవకొండ: వజ్రకరూరు మండలం జరుట్ల రాంపురంలోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల తండ్రి తుళువ నరసనాయకుడు రాయించిన శిలాశాసనం బయటపడింది. ఇందుకు సంబంధించిన వివరాలను చరిత్రకారుడు బుక్కపట్నం గోపి సోమవారం వెల్లడించారు. స్థానిక ఉపాధ్యాయుడు రామప్పచౌదరి, ఆలయ అర్చకులు మంజునాథ్ సహకారంతో రాతి శాసనాన్ని ఫొటో తీసి భారత పురావస్తు శాఖ డైరెక్టర్ మునిరత్నం రెడ్డికి పంపినట్లు వివరించారు. కన్నడ లిపిలో ఉన్న ఈ శాసనంలో పేర్కొన్న విధంగా ఆలయం ఉన్న ప్రాంతంలో జరిపూటి అనే గ్రామం ఉండేదని, ఆ గ్రామం ద్వారా వచ్చే ఆదాయాన్ని రామలింగేశ్వర స్వామి ఆలయానికి చెందేలా శాసనాన్ని శాలివాహన శకం 1497లో ఛైత్రమాసం శుక్ల నవమి (శ్రీరామనవమి) నాడు తుళువ నరసనాయకుడు రాయించినట్లుగా స్పష్టమవుతోందని పేర్కొన్నారు. ఈ ఆలయాన్ని దక్షిణ వారణాసి, సేతు బిందు రామేశ్వరం ఆలయం, శ్రీశైల సమాన క్షేత్రంగా ప్రస్తావించారని వివరించారు.


