ఉరవకొండ: ‘కరోనా విపత్కర పరిస్థితుల్లోనూ మీ పనితీరుతో పార్టీ ప్రతిష్టను మరింత పెంచారు’ అంటూ తాజా మాజీ సర్పంచు (వైఎస్సార్సీపీ మద్దతు)లను ఆ పార్టీ పీఏసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే, ఉరవకొండ సమన్వయకర్త వై.విశ్వేశ్వరరెడ్డి అభినందించారు. ఉరవకొండ నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ సర్పంచుల ఆత్మీయ అభినందన వీడ్కోల సభ సోమవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. విశ్వతో పాటు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కమిటీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బెస్త రమణ, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి సీపీ వీరన్న, జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్తూలూరు అశోక్ హాజరయ్యారు. విశ్వ మాట్లాడుతూ.. టీడీపీ నేతల కుట్రలు, కుతంత్రాలను దీటుగా ఎదుర్కొని నియోజకవర్గంలో 90 శాతానికి పైగా వైఎస్సార్సీపీ మద్దతుదారులు సర్పంచ్ స్థానాలను దక్కించుకోవడం అభినందనీయమన్నారు. వీరందరూ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఐదేళ్లు సమర్థవంతంగా పాలన సాగించారన్నారు. ఈ ఐదేళ్లలో ఏ ఒక్క సర్పంచ్పై కూడా అవినీతి, ఆరోపణలు రాకపోవడం గర్వకారణమన్నారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన ఈ రెండేళ్లలోనూ టీడీపీ నేతల ఒత్తిళ్లను తట్టుకుని ప్రజలకు నాణ్యమైన సేవలు అందించి అవార్డులు, సత్కారాలను అందుకోవడం గొప్ప విషయమన్నారు. అనంతరం సర్పంచులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఏసీ పార్వతమ్మ, ఎంపీపీలు దేవిబాయి, కరణం పుష్పవతి, నారాయణరెడ్డి, నరసింహులు, వైస్ ఎంపీపీ ఈడిగ ప్రసాద్, పంచాయతీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు యోగేంద్రరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి బసవరాజు, ఏసీ ఎర్రిస్వామి, ఐదు మండలాల కన్వీనర్లు ఎర్రిస్వామిరెడ్డి, సోమశేఖర్రెడ్డి, మచ్చన్న, కురుబ డోనేకల్లు రమేష్, బైరెడ్డి రామచంద్రారెడ్డి, శ్రీనివాసులు, నాయకులు కరణం భీమిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
తాజా మాజీ సర్పంచులను అభినందించిన వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు వై.విశ్వేశ్వరరెడ్డి


