అనంతపురం ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) మలిదశ పోరాటంలో భాగంగా సోమవారం పదో తరగతి జవాబుపత్రాల మూల్యంకన కేంద్రం వద్ద జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలతో విధులకు హాజరై నిరసన వ్యక్తం చేశారు. 12వ పీఆర్సీని వెంటనే నియమించాలని, కనీసం 30 శాతం తాత్కాలిక మధ్యంతర భృతిని తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న నాలుగు డీఏల బకాయిలను, సరెండర్ లీవ్ బకాయిలను వెంటనే చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. సీపీఎస్, జీపీఎస్ విధానాలను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని, ఇంగ్లీష్ మీడియంతో పాటు తెలుగు మీడియాన్ని సమాంతరంగా కొనసాగించాలన్నారు. యూనిఫైడ్ సర్వీస్ రూల్స్కు సంబంధించిన సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఫ్యాప్టో చైర్మన్ శ్రీనివానాయక్, సెక్రటరీ జనరల్ పురుషోత్తం, సభ్యులు రమణారెడ్డి, నరేష్, అక్కులన్న, కోటేశ్వరరావు పాల్గొన్నారు. వీరికి వైఎస్సార్టీఏ జిల్లా అధ్యక్షుడు నాగిరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెంకటరమణప్ప, జిల్లా ఉపాధ్యక్షుడు సిద్దప్రసాద్, కార్యదర్శులు అరుడప్ప, పవన్కుమార్, తదితరులు మద్దతు తెలిపారు.


