అనంతపురం అర్బన్: శ్రీరాముని కృపాకటాక్షాలతో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలతో జిల్లా సుభిక్షంగా ఉండాలని జాయింట్ కలెక్టర్ విష్ణచరణ్ ఆకాంక్షించారు. రెవెన్యూ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కృష్ణకళామందిర్లోని రామాలయంలో సీతారాముల కల్యాణ మహోత్సవం నిర్వహించారు. జేసీ ముఖ్యఅతిథిగా హాజరై ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం జేసీ మాట్లాడుతూ శ్రీరాముని ఆశీస్సులతో ప్రతి ఇంటా సిరిసంపదలు వెల్లివిరియాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆనందమయ జీవితం గడపాలని కోరుకున్నారు. కల్యాణోత్సవంలో డీఆర్ఓ మలోల, ఎఫ్ఎస్ఓ రామకృష్ణారెడ్డి, ఆర్డీఓ కేశవనాయుడు, డిప్యూటీ కలెక్టర్ ఆనంద్, రిటైర్డ్ తహసీల్దార్ పగడాల మల్లికార్జున, తహసీతల్దార్లు హరికుమార్, శ్రీధర్మూర్తి, రజాక్, మారుతి పాల్గొన్నారు. కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ఎన్ దివాకర్రావు, జి.సోమశేఖర్ పాల్గొన్నారు.


