గుత్తి: గ్యాస్ ఏజెన్సీ వద్ద క్యూ లైన్లో పెట్టిన నాలుగు వంట గ్యాస్ ఖాళీ సిలిండర్లు అపహరణకు గురయ్యాయి. బుధవారం ఉదయం గుత్తిలో ఈ ఘటన చోటు చేసుకుంది. గుత్తిలోని జంగాల కాలనీతో పాటు ఇతర కాలనీలకు చెందిన జయలక్ష్మి, లక్ష్మి, రాముడు, మరొకరు తాడిపత్రి రోడ్డులోని సుదర్శన్ ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ వద్ద తమ ఖాళీ సిలిండర్లను క్యూలైన్లో పెట్టి, కౌంటర్ వద్ద నగదు చెల్లించేందుకు వెళ్లారు. అక్కడ జనం ఎక్కువగా ఉండడంతో రద్దీ నెలకొంది. ఆ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆ సిలిండర్లను అపహరించుకెళ్లారు. ఘటనపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.
పాడి, మాంసం ఉత్పత్తులకు ప్రోత్సాహం
అనంతపురం అగ్రికల్చర్: ఆహార శుద్ధికి సంబంధించి పాడి, మాంసం ఉత్పత్తుల కుటీర పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి రాయితీలు, బ్యాంకుల ద్వారా ప్రోత్సాహం కల్పిస్తామని పశుసంవర్ధకశాఖ జేడీ ప్రేమ్చంద్, ఎల్డీఎం నరేష్, పీఎంఎఫ్ఎంఈ రిసోర్స్ పర్సన్ హరీష్ తెలిపారు. ప్రధానమంత్రి ఆహారశుద్ధి క్రమ బద్ధీకరణ పథకం (పీఎం ఎఫ్ఎంఈ)పై బుధవారం స్థానిక పశుశాఖ డీడీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో వారు మాట్లాడారు. గరిష్టంగా రూ.10 లక్షల వరకు రుణసదుపాయం ఉంటుందన్నారు. ఇందులో 10 శాతం లబ్ధిదారులు భరిస్తే... 90 శాతం బ్యాంకుల ద్వారా రుణం అందేలా చూస్తామన్నారు. 35 శాతం రాయితీ వర్తిస్తుందని తెలిపారు. పాలు, పెరుగు, వెన్న, పన్నీర్, కోవా, ఇతర మాంసం ఉత్పత్తులు తదితర పాడి అనుబంధ ఉత్పత్తుల యూనిట్లకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆసక్తి, అర్హత ఉన్న వారు రీసోర్స్ పర్సన్ హరీష్ (9676796974)ను సంప్రదించాలని సూచించారు.


