పుట్లూరు: మండలంలోని కుమ్మనమల గ్రామంలోని పెద్దమ్మ ఆలయంలో శనివారం రాత్రి చోరీ జరిగింది. ఆలయంలో ఉన్న 60 తులాల వెండి ఆభరణాలను దొంగలు అపహరించినట్లు గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ సురేంద్రబాబు చోరీ జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. ఆలయ నిర్వాహకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఘనంగా లంకా దహనం
డీ హీరేహాళ్ (రాయదుర్గం): ప్రముఖ పుణ్యక్షేత్రం మురడి ఆంజనేయస్వామి ఉగాది ఉత్సవాల్లో భాగంగా చివరి రోజు లంకా దహనాన్ని కనుల పండువగా నిర్వహించారు. సుమారు రెండు గంటలకు పైగా సాగిన లంకా దహనాన్ని వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. అంతకు ముందు ఉదయం 7 గంటలకు గండ దీపం మోయడం, మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల వరకు అన్నదానం చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు పానక వినియోగంజరిగింది. సాయంత్రం 4 గంటలకు వసంతోత్సవం నిర్వహించారు. రాత్రి 9 గంటలకు చెక్క భజన, లంకాదహనంతో ఉత్సవాలను ముగించారు.


