అనంతపురం: వైఎస్ జగన్ మోహన్రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అయితేనే మహిళాభ్యున్నతి సాధ్యమవుతుందని జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో అనేక సంక్షేమ పథకాల ద్వారా చేయూతనందించి మహిళల ఆర్థిక స్వావలంబనకు పాటుపడ్డారని గుర్తు చేశారు. ఆదివారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి మాట్లాడుతూ సమాన అవకాశాలు కల్పించడంతోపాటు విద్య, ఆర్థికంగా చేయూతనందించిన ఘనత మాజీ సీఎం వైఎస్ జగన్కే దక్కిందన్నారు. చట్టసభలు, నామినేటెడ్, పార్టీలో మహిళలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారన్నారు. సంక్షేమ పథకాల్లో మహిళలకు పెద్దపీట వేసి వారి ఆర్థిక స్వావలంబనకు కృషి చేశారని కొనియాడారు. ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం మహిళల సంక్షేమాన్ని విస్మరించారన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లకే పింఛన్ తదితర హామీలు అమలు చేయకుండా నిలువునా మోసం చేశారన్నారు. ఎవరైనా హామీలపై నిలదీస్తే అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. మద్యం, గంజాయి విచ్చలవిడిగా అమ్ముతుండటంతో మత్తులో దాడులకు తెగబడుతున్నారని, మహిళలకు రక్షణ లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్పర్సన్ నాగరత్నమ్మ, గుత్తి మున్సిపల్ వైస్ చైర్పర్సన్ వరలక్ష్మి, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి దేవి, రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణవేణి, సర్పంచ్ భూమా కమలమ్మ, కార్పొరేటర్లు సాకే చంద్రలేఖ, రాజేశ్వరి, హసీనా, పార్టీ నేతలు సుశీలమ్మ, జిల్లా ఉపాధ్యక్షురాలు సుజాత, రాధాయాదవ్, జిల్లా కార్యదర్శి భారతి, అంజలి, పార్వతి, ప్రసన్న, చంద్రకళ, సుగుణమ్మ, జయమ్మ, లక్ష్మీదేవి, లక్ష్మీ, పద్మావతి, లలిత, రుద్రంపేట, లక్ష్మీ, అంజినమ్మ, సువర్ణ, కుళ్లాయమ్మ, సులోచన, రాజేశ్వరి, కమలమ్మ, అనూరాధ, రమీజా, మహేశ్వరి తదితరులు పాల్గొన్నారు.


