ఆత్మవిశ్వాసం ఆయుధమై | - | Sakshi
Sakshi News home page

ఆత్మవిశ్వాసం ఆయుధమై

Nov 22 2025 7:04 AM | Updated on Nov 22 2025 7:04 AM

ఆత్మవ

ఆత్మవిశ్వాసం ఆయుధమై

ప్రోత్సాహం తోడై..

అనంతపురం కార్పొరేషన్‌: తండ్రి ప్రోత్సాహానికి తోడు ఆత్మవిశ్వాసం జతకట్టడంతో క్రికెట్‌లో తనకు ఎదురు లేదని నిరూపిస్తున్నాడు రాప్తాడు మండలం బొమ్మేపర్తి గ్రామానికి చెందిన మచ్చా రామలింగారెడ్డి, లక్ష్మి దంపతుల కుమారుడు మచ్చా దత్తారెడ్డి. క్రీజులో కాసేపు నిలదొక్కుకుంటే ప్రత్యర్థి బౌలర్లకు ముచ్చెమటలు పట్టించేలా బంతిని అలవోకగా బౌండరీలు దాటిస్తూ పరుగుల వర్షం కురిపిస్తున్నాడు. దీంతో పాటు వికెట్‌ కీపర్‌గానూ ప్రతిభ కనబరుస్తున్నాడు. ఆంధ్ర క్రికెట్‌ అకాడమీలో సభ్యుడిగా ఉన్న సమయంలో భారత మాజీ క్రికెటర్‌ ఎంఎస్‌కే ప్రసాద్‌ వద్ద కీపింగ్‌లో మెలకువలు అభ్యసించాడు. ఈ సీజన్‌లో రాష్ట్రంలోనే అత్యధికంగా 41 స్టంపింగ్‌లు, క్యాచ్‌లు పట్టి తన ప్రత్యేకతను చాటుకున్నాడు. అండర్‌ –12, 14, 16, 19, 23 ఇలా అన్ని ఫార్మాట్లలో అంచనాలకు మించి రాణించి, 20 ఏళ్లకే ఆంధ్ర రంజీ స్క్వాడ్‌లో చోటు దక్కించుకున్నాడు. అతనిలోని క్రీడాకారుడికి పట్టం కడుతూ ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ ఇటీవల అండర్‌ –23 ఏపీ జట్టుకు ఎంపిక చేసింది. జిల్లా సీనియర్‌ క్రికెటర్లలో ఒకరైన తన తండ్రి మచ్చా రామలింగారెడ్డి స్ఫూర్తి,తోనే తాను కూడా క్రికెట్‌లోకి అడుగు పెట్టానని, తనకు అన్ని విధాలుగా వెన్నంటి ఉంటూ ఆర్డీటీ ప్రోగ్రాం డైరెక్టర్‌ మాంఛో ఫెర్రర్‌ అందిస్తున్న ప్రోత్సాహాన్ని మరువలేనని మచ్చా దత్తారెడ్డి అంటున్నాడు. భారత జట్టులో చోటు దక్కించుకోవడమే తన అంతిమ లక్ష్యంగా సాధన చేస్తున్నట్లు పేర్కొంటున్నాడు.

అధిగమించిన మైలు రాళ్లు

● బీసీసీఐ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో జరిగిన అండర్‌ –19, 23 క్రికెట్‌ మ్యాచ్‌ల్లో మచ్చా దత్తారెడ్డి 1,500 పరుగులు సాధించాడు. వికెట్‌కీపర్‌గా, బ్యాటర్‌గా బీసీసీఐ టోర్నీలో ఈ ఘనత సాధించిన వారిలో దత్తారెడ్డి ప్రథముడు కావడం గమనార్హం.

● ఆంధ్ర ప్రీమియర్‌ లీగ్‌– 4 లో విజేతగా నిలిచిన తుంగభద్ర వారియర్స్‌ జట్టులో దత్తారెడ్డి కీలక ఆటగాడిగా ఖ్యాతి దక్కించుకున్నాడు.

● గత మూడేళ్లలో జాతీయ స్థాయి టోర్నీల్లో పాల్గొని హర్యానాపై 172 నాటౌట్‌, మణిపూర్‌పై 105 నాటౌట్‌గా క్రీజ్‌లో నిలిచాడు. అండర్‌ –23 డెబ్యూట్‌లో గోవా జట్టుపై 103 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

● అండర్‌ –19 కూచ్‌బెహర్‌ ట్రోఫీ 2021–22 సీజన్‌లో 250, 2022–23 సీజన్‌లో 470 పరుగులు చేశాడు.

● 2022–23 లో జరిగిన అండర్‌ –19 వినోద్‌ మన్కడ్‌ ట్రోఫీలో 150 పరుగులు సాధించాడు.

● 2023–24 సీజన్‌లో అండర్‌ –23 సీకే నాయుడు ట్రోఫీలో 140 పరుగులు సాధించాడు.

వికెట్‌కీపర్‌గా, బ్యాటర్‌గా రాణిస్తున్న మచ్చా దత్తారెడ్డి

20 ఏళ్లకే రంజీ స్క్వాడ్‌లో చోటు

అన్ని రకాల ఫార్మాట్లలోనూ దూకుడు

ఆత్మవిశ్వాసం ఆయుధమై 1
1/1

ఆత్మవిశ్వాసం ఆయుధమై

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement