
నాలుగు కళ్ల సీతాకోక చిలుక ప్రత్యక్షం
రాప్తాడు: మండలంలోని మరూరు గ్రామంలో నాలుగు కళ్ల సీతాకోక చిలుక ప్రత్యక్షమైంది. గ్రామం నుంచి ధర్మవరానికి వెళ్లే మార్గంలో ఉన్న కుళ్లాయప్ప హోటల్ వద్ద కనిపించిన సీతాకోక చిలుక రెక్కలపై నాలుగు కళ్లు ఉండడంతో జనం ఆసక్తిగా గమనించారు. తమ మొబైల్స్లో ఫొటోలు తీసేందుకు పోటీ పడ్డారు.
నాలుగు గ్రామాల్లో మ్యాజిక్ డ్రైయిన్లు
అనంతపురం టౌన్: స్వర్ణాంధ్ర – స్వచ్చాంధ్రా కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికై న కూడేరు మండలం ముద్దలాపురం, పామిడి మండలం నీలూరు, గుమ్మఘట్ట మండలం 75 వీరాపురం, పెద్దవడుగూరు మండలం చిన్నవడుగూరు గ్రామాల్లో మ్యాజిక్ డ్రైయిన్లు ఏర్పాటు చేస్తున్నట్లు డ్వామా పీడీ సలీంబాషా తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పీఆర్ శాఖ అధికారుల నుంచి నివేదికలు అందగానే పనులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు.
ఏసీబీ చార్జెస్పై ప్రజెంటింగ్ అధికారి నియామకం
అనంతపురం అర్బన్: అవినీతి కేసులో విశ్రాంత తహసీల్దారు, మరికొందరు రెవెన్యూ అధికారులపై ఏసీబీ అధికారులు ఫ్రేమ్ చేసిన చార్జెస్పై ప్రజెంటింగ్ అధికారిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు సోమవారం జారీ అయ్యాయి. 2020, జనవరి 24న ముదిగుబ్బ తహసీల్దారు కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. పట్టాదారు పాసుపుస్తకాల మంజూరు, ఆన్లైన్లో నమోదు, మ్యుటేషన్ తదితర వ్యవహారాల్లో అక్రమాలు చోటు చేసుకున్నట్లుగా గుర్తించి కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో అప్పటి తహసీల్దారు అన్వర్ హుస్సేన్ (పస్తుతం ఉద్యోగ విరమణ చేశారు), డిప్యూటీ తహసీల్దారు రామకృష్ణ, మండల సర్వేయర్ రత్నాకర్బాబు, రెవెన్యూ ఇన్స్పెక్టర్–1 సందీప్కుమార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, ఏఎస్ఓ చంద్రశేఖర్, మరికొందరిపై ఏసీబీ చార్జెస్ ఫైల్ చేసింది. ఈ వ్యవహారంలో ప్రస్తుతం ప్రజెంటింగ్ అధికారిని ప్రభుత్వం నియమించింది. ఏసీబీ చార్జెస్పై ప్రజెంటింగ్ అధికారి విచారణ చేపట్టి నివేదికను ప్రభుత్వానికి సమర్పించనున్నారు.
‘పచ్చ’ నేతలు.. డబ్బుల కట్టలు!
శింగనమల: కూటమి ప్రభుత్వం వచ్చాక ఇసుక, మట్టిని ‘తమ్ముళ్లు’ చెరబట్టారు. పేకాటతో జేబులు నింపుకుంటున్నారు. తాజాగా ‘పచ్చ’ నేతలు ఓ చోట కూర్చుని నోట్ల కట్టలు లెక్కిస్తున్న వీడియో బయటకు రాగా.. కాంట్రాక్టు ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ వసూళ్లు చేశారని టీడీపీకి చెందిన సోషల్ మీడియా గ్రూపుల్లోనే తీవ్ర చర్చ సాగడం గమనార్హం. నియోజకవర్గ టీడీపీలో ఇప్పటికే రెండు గ్రూపులు నడుస్తున్నాయి. ఈ క్రమంలో తాజాగా బయటకి వచ్చిన వీడియోని ఎమ్మెల్యే వ్యతిరేక వర్గ నాయకులు విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. నియోజకవర్గంలో విద్యుత్ శాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలిప్పిస్తామంటూ రూ.లక్షల్లో వసూలు చేశారంటూ పోస్టులు పెడుతున్నారు.