
జస్టిస్ సురేష్ రెడ్డికి ఘన స్వాగతం
అనంతపురం టవర్క్లాక్: రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ కె. సురేష్ రెడ్డికి అధికారులు ఘన స్వాగతం పలికారు. స్థానిక ఆర్ అండ్బీ అతిథి గృహంలో శనివారం జస్టిస్ సురేష్ రెడ్డిని జిల్లా ఇన్చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ మర్యాద పూర్వకంగా కలిశారు. పూలమొక్క అందజేసి స్వాగతం పలికారు.
రేపు కలెక్టరేట్లో
‘పరిష్కార వేదిక’
అనంతపురం అర్బన్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఈనెల 28వ తేదీ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు ఇన్చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ తెలిపారు. రెవెన్యూ భవన్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం జరుగుతుందన్నారు. అన్ని శాఖల జిల్లా అధికారులు పాల్గొంటారని, ప్రజలు తమ సమస్యలను అర్జీ రూపంలో అధికారులకు సమర్పించాలని సూచించారు. గతంలో అర్జీ ఇచ్చి ఉంటే దానికి సంబంధించి రసీదు తీసుకురావాలన్నారు. సమర్పించిన అర్జీల స్థితిని కాల్సెంటర్ 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. ప్రజలు అర్జీలను meekosam. ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లోనూ సమర్పించవచ్చని తెలిపారు.
వృద్ధులు, నిస్సహాయకులకు ఇంటివద్దే రేషన్ పంపిణీ
అనంతపురం అర్బన్: 65 ఏళ్లుపైబడిన వృద్ధులు, దివ్యాంగులు, నిస్సహాయులకు వారి ఇళ్ల వద్దకే డీలర్లు వెళ్లి రేషన్ పంపిణీ చేయాలని ఇన్చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ఆదేశించారు. డీలర్లు సక్రమంగా పంపిణీ చేస్తున్నారా లేదా అని అధికారులు తనిఖీ చేయాలన్నారు. శనివారం స్థానిక నాయక్నగర్లోని 37వ చౌక ధరల దుకాణం పరిధిలోని వృద్ధుల ఇళ్లవద్దకు ఇన్చార్జ్ కలెక్టర్ వెళ్లి బియ్యం, సరుకులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 31లోపు చౌక దుకాణాల పరిధిలో బియ్యం కార్డులున్న వృద్ధులు, దివ్యాంగులు, నిస్సహాయులకు రేషన్ అందించాలని చెప్పారు. అధికారులు ప్రత్యేక శ్రద్ధతో క్షేత్రస్థాయిలో పర్యటించి పంపిణీ ప్రక్రియ సక్రమంగా జరిగేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. కార్యక్రమంలో పౌర సరఫరాల శాఖ డీఎం రమేష్రెడ్డి, తహసీల్దారు హరికుమార్, సీఎస్డీటీ బాషా తదితరులు పాల్గొన్నారు.
ఓపెన్ స్కూల్ ప్రవేశాలను సద్వినియోగం చేసుకోండి
అనంతపురం ఎడ్యుకేషన్: సార్వత్రిక విద్యాపీఠం (ఓపెన్ స్కూల్) ద్వారా 2025– 26 విద్యా సంవత్సరంలో పదోతరగతి, ఇంటర్మీడియట్ ప్రవేశాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందనాయక్ కోరారు. చదువు మధ్యలో ఆపేసిన వారికి, ఏవైనా పనులు చేసుకుంటున్న వారు, ఉద్యోగాలు చేసుకుంటూ రెగ్యులర్గా పాఠశాల, కళాశాలలకు వెళ్లలేని వారికి ఇదో మంచి అవకాశమన్నారు.ప్రచారంలో భాగంగా శనివారం గృహ నిర్మాణ శాఖ జిల్లా ప్రాజెక్ట్ డైరెక్టర్ శైలజ, మైనార్టీ సంక్షేమ శాఖ జిల్లా అధికారి జి. రామసుబ్బారెడ్డి, అంబేడ్కర్ గురుకుల పాఠశాలల జిల్లా సమన్వయ అధికారి జయలక్ష్మి, బీసీ సంక్షేమశాఖ డీడీ కుష్బూ కొఠారి చేతుల మీదుగా వారివారి కార్యాలయాల్లో ఓపెన్ స్కూల్కు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. అలాగే కరపత్రాలు పంపిణీ చేశారు.
జిల్లాకు 594 మెట్రిక్ టన్నుల ఎరువులు
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాకు మాధవన్ కంపెనీకి చెందిన 594 మెట్రిక్ టన్నుల ఎరువులు చేరినట్లు రేక్ అధికారి, ఏడీఏ అల్తాఫ్ అలీఖాన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. అందులో 24–24–0–3–0 రకం 248 మెట్రిక్ టన్నులు, 24–24–0 రకం 282 మెట్రిక్ టన్నులు, 20–20–0–13 రకం 64 మెట్రిక్ టన్నులు సరఫరా అయిందని పేర్కొన్నారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఇండెంట్ మేరకు ప్రైవేట్ హోల్సేల్ డీలర్లకు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు.

జస్టిస్ సురేష్ రెడ్డికి ఘన స్వాగతం