న్యాయం జరగకపోతే చావే దిక్కు | - | Sakshi
Sakshi News home page

న్యాయం జరగకపోతే చావే దిక్కు

Jun 10 2025 7:22 AM | Updated on Jun 10 2025 7:33 AM

-

 ప్రజల్లో కట్టలు తెంచుకున్న ఆవేశం

 కూటమి ప్రభుత్వ అలసత్వంపై ప్రతిపక్షాలు, ప్రజా సంఘాల మండిపాటు

అబలలకు రక్షణ ఎక్కడ అంటూ ఆవేదన

 బాధిత కుటుంబానికి వైఎస్సార్‌ సీపీ బాసట

 న్యాయం చేయాలంటూ ఆందోళన... ఎస్పీకి వినతిపత్రం

అనంతపురం: గిరిజన విద్యార్థిని దారుణ హత్యపై ప్రజాగ్రహం పెల్లుబికింది. యువతిని అతి కిరాతకంగా చంపిన వైనంపై ప్రజల్లో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకున్నాయి. రాస్తారోకోలు చేపట్టారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై తీవ్రంగా మండిపడ్డారు. దుండగులను కఠినంగా శిక్షించాలని ముక్తకంఠంతో డిమాండ్‌ చేశారు.

తోడుగా మేమున్నామంటూ..
బాధిత గిరిజన కుటుంబానికి వైఎస్సార్‌ సీపీ బాసటగా నిలిచింది. తోడుగా మేమున్నామంటూ కదం తొక్కింది. సోమవారం నగరంలోని అంబేడ్కర్‌ విగ్రహం నుంచి ఎస్పీ కార్యాలయం వరకు భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. ఎస్పీ కార్యాలయం మెయిన్‌ గేట్‌ ముందు రెండు గంటల సేపు ధర్నా చేశారు. హతురాలు తన్మయి తల్లిదండ్రులతో కలిసి జెడ్పీ చైర్‌పర్సన్‌ బోయ గిరిజమ్మ, నగర మేయర్‌ వసీం సలీం, డిప్యూటీ మేయర్‌ వాసంతి సాహిత్య, పార్టీ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా టాస్క్‌ఫోర్స్‌ సభ్యులు రమేష్‌ గౌడ్‌, పార్టీ నగర అధ్యక్షుడు చింతా సోమశేఖర్‌ రెడ్డి, వైఎస్సార్‌ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఆడబిడ్డకు అన్యాయం జరిగితే సహించేది లేదన్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఏమయ్యారంటూ నిలదీశారు. 

విద్యార్థిని తన్మయిని దారుణంగా హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. నరేష్‌ అనే వ్యక్తిపై అనుమానం ఉందని బాధిత తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని వాపోయారు. ఎస్పీకి వినతిపత్రం అందించేందుకు వెళ్తుండగా పోలీసులు గేట్లు మూసివేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు, నేతలకు మధ్య తోపులాట జరిగింది. వైఎస్సార్‌సీపీ కండువా వేసుకున్న వారిని లోపలికి అనుమతించేది లేదంటూ అనంతపురం రూరల్‌ డీఎస్పీ వెంకటేశులు విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్‌ యాదవ్‌తో వాదించారు. 

కలెక్టర్‌ కార్యాలయంలోకే పార్టీ కండువా వేసుకుని ప్రజల సమస్యలపై విన్నవించేందుకు వెళ్తామని పేర్కొనడంతో అనుమతించారు. వైఎస్సార్‌ సీపీ జిల్లా అధికార ప్రతినిధి చింతకుంట మధు, మహిళా విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కృష్ణవేణి,పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవి, యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు దాదు, నాయకులు శివ శంకర్‌ నాయక్‌,అనుబంధ విభాగాల అధ్యక్షులు అమర్‌ నాథ రెడ్డి,చంద్రశేఖర్‌ యాదవ్‌, శ్రీనివాస నాయక్‌, టీటీడీ మాజీ మెంబర్‌ అశ్వర్థ నాయక్‌, కార్పొరేటర్లు రహంతుల్లా, ఇషాక్‌, కమల్‌ భూషణ్‌, అనిల్‌ కుమార్‌ రెడ్డి, సాకే చంద్రలేఖ, శేఖర్‌ బాబు, శ్రీనివాసులు, విద్యార్థి నాయకులు మంజునాథ రెడ్డి, వెంకటేశ్‌, కైలాష్‌, రాహుల్‌ రెడ్డి, నిశాంత్‌రెడ్డి, అశోక్‌, శేఖర్‌, ప్రశాంత్‌,సాయి నితిన్‌, అంజన్‌ రెడ్డి, ఫయాజ్‌ బాషా, మహిళా నేతలు ప్రియాంక, భారతి, మహేశ్వరి, సల్మా, చంద్రగిరి రాధా, పార్వతి, సుజాత రెడ్డి, అంజలి, శోభ, రాంప్రసాద్‌, ఎంఎస్‌ఎస్‌ సాదిక్‌, సాకే కుళ్లాయిస్వామి, గోవింద్‌ నాయక్‌, గిరిజన విభాగం జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, నగర అధ్యక్షుడు శ్రీనివాసులు, గుజ్జల శివయ్య, ఆనంద్‌, సురేంద్ర, మోహన్‌ నాయక్‌, శివ, కావాడి వీర, రాజు నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

సీపీఎం రాస్తారోకో
ఎస్పీకి వినతిపత్రం అందించిన అనంతరం తన్మయి తల్లి అరుణ, నాయకులు మీడియాతో మాట్లాడారు. తమ ఒక్కగానొక్క బిడ్డనూ పొట్టన పెట్టుకున్నారని అరుణ ఆవేదన వ్యక్తం చేశారు. ‘మంగళవారం రాత్రి తన్మయి బయటకు వెళ్లింది. రాత్రంతా వెతికినా కనిపించలేదు. బుధవారం ఉదయం పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశాం. అనుమానితుడి పేరు చెప్పి వాడి ఫోన్‌ నంబర్‌ కూడా ఇచ్చాం. వాడే మా అమ్మాయికి చివరి ఫోన్‌ చేశాడని చెప్పాం. అయినప్పటికీ ఘోరాన్ని ఆపలేకపోయారు. పోలీసుల వైఫల్యం వల్లే బిడ్డను కోల్పోయాం. నా బిడ్డ ఎంతటి వేదన పడిందో.. వాడు కూడా అలాగే నరకయాతన అనుభ వించాలి. మాకు న్యాయం జరగకపోతే చావే దిక్కు’ అంటూ అరుణ వాపోయారు.

అనంతపురం అర్బన్‌: గిరిజన విద్యార్థిని తన్మయిని హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలంటూ సీపీఎం ఆధ్వర్యంలో నాయకులు సోమవారం స్థానిక టవర్‌క్లాక్‌ వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం నగర కార్యదర్శి రామిరెడ్డి మాట్లాడుతూ జిల్లాలో వరుస ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయన్నారు. విద్యార్థిని తన్మయి హత్య, ఏడుగుర్రాలపల్లిలో బాలికపై అత్యాచారం అత్యంత దారుణమన్నారు. ఏడుగుర్రాలపల్లి ఘటనలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. బాధిత కుటుంబానికి అండగా నిలవాల్సింది పోయి బెదిరింపులకు పాల్పడడం చూస్తే పోలీసులు నిందితులకు అనుకూలంగా పనిచేస్తున్నారనేది స్పష్టమవుతోందన్నారు. ఎవరిని రక్షించడానికి ఇలా చేస్తున్నారని ప్రశ్నించారు. కార్యక్రమంలో నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, వలి, ప్రకాష్‌, మసూద్‌, ఇర్ఫాన్‌, లక్ష్మినరసమ్మ, పరమేష్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement