
జీవితంలో యోగా భాగం కావాలి
అనంతపురం కార్పొరేషన్: ప్రతి ఒక్కరి జీవితంలో యోగా ఓ భాగం కావాలని, తద్వారా ఎన్నో రకాల సమస్యలకు పరిష్కారం లభిస్తుందని కలెక్టర్ డాక్టర్ వినోద్కుమార్ అన్నారు. యోగాంధ్ర మాసోత్సవాల్లో భాగంగా సోమవారం నగరంలోని వివిధ సచివాలయాల పరిధిలో ర్యాలీలు నిర్వహించారు. 65వ సచివాలయం పరిధిలో జరిగిన ర్యాలీలో కలెక్టర్ పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రజలందరూ పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నగర పాలక సంస్థ కమిషనర్ బాలస్వామి, డిప్యూటీ కమిషనర్ డాక్టర్ పావని, ఎస్ఈ చంద్రశేఖర్, తహశీల్దార్ హరికుమార్, కార్పొరేటర్లు శేఖర్ బాబు, టీవీ చంద్రమోహన్ రెడ్డి, పలువురు యోగా గురువులు పాల్గొన్నారు.