
‘జన్విత’లో మహిళ మృతి
అనంతపురం మెడికల్: నగరంలోని సూర్యనగర్లో ఉన్న జన్విత ఆస్పత్రిలో ఓ మహిళ మృతి వివాదాస్పదంగా మారింది. మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ కుటుంబ సభ్యులు, ఎమ్మార్పీఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. వివరాలు.. అనారోగ్యంతో బాధపడుతున్న గార్లదిన్నె మండలం ఇల్లూరు గ్రామానికి చెందిన హుస్సేన్బీ (48) ఈ నెల 7న జన్విత ఆస్పత్రిలో చేరింది. ఆమె గర్భసంచిలో గడ్డ ఉన్నట్లుగా గుర్తించిన వైద్యురాలు మరుసటి రోజున శస్త్రచికిత్స చేసి తొలగించారు. మంగళవారం కడుపు ఉబ్బరంగా ఉందంటూ బాధపడుతుండడంతో స్కాన్కు రెఫర్ చేశారు. కాగా, స్కాన్ తీయించుకుని ఆస్పత్రికి చేరుకోగానే హుస్సేన్బీ మృతి చెందింది. కార్డియాక్ అరెస్ట్తో మృతి చెందినట్లు అదే ఆస్పత్రి వైద్యులు నిర్ధారించారు. కాగా, మృతికి ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆందోళనకు దిగడంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని సర్దిచెప్పారు. విషయం తెలుసుకున్న డీఎంహెచ్ఓ డాక్టర్ భ్రమరాంబ దేవి సదరు ఆస్పత్రికి చేరుకుని మృతిపై ఆరా తీశారు.