
టీచర్ల సహనానికి కౌన్సెలింగ్
అనంతపురం ఎడ్యుకేషన్: విద్యాశాఖ ఉన్నతాధికారులు మళ్లీ టీచర్ల సహనానికి పరీక్ష పెట్టారు. స్థానిక పంగల్రోడ్డులోని ఆర్డీటీ స్కూల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ల బదిలీల కౌన్సెలింగ్ తొలిరోజు మంగళ వారం రసాభాస నడుమ రాత్రి 10.30 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి దాటినా కొనసాగిన విషయం తెలిసిందే. అయితే, అప్పటికీ జనరల్, ప్రిఫరెన్షియల్ కేటగిరీలకు సంబంధించి సాంకేతిక సమస్యలు తలెత్తడం.. వాటిని సరి చేసే అవకాశం రాష్ట్ర అధికారులకే ఉండడంతో చేసేదిలేక అర్ధరాత్రి దాటిన తర్వాత కౌన్సెలింగ్ ప్రక్రియను ఉన్నతాధికారులు వాయిదా వేశారు.
ఉదయం 11 గంటలకు అని చెప్పి...
బుధవారం ఉదయం 11 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని,జాబితాలోని 1 నుంచి 500 సంఖ్య వరకు హాజరుకావాలంటూ ఉదయాన్నే ఉపాధ్యాయులకు మెసేజ్లు పంపారు. తర్వాత 2 గంటలకు వాయిదా వేశారు. అప్పటికీ స్పష్టత రాకపోవడంతో చివరకు సాయంత్రం 4 గంటలకు 1 నుంచి 350 సంఖ్య వరకు రావాలంటూ మెసేజ్లు పెట్టారు. ఎట్టకేలకు 4.30 గంటలకు కౌన్సెలింగ్ ప్రారంభమైంది. కౌన్సెలింగ్ ప్రక్రియను పాఠశాల విద్య రీజనల్ జాయింట్ డైరెక్టర్ శామ్యూల్ పరిశీలించారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆయన దృష్టికి పలు సమస్యలను తీసుకెళ్లారు.
వెబ్ ఆప్షన్ల బహిష్కరణ..
భాషా పండితుల (ఎల్పీ) బదిలీల్లో భాగంగా బుధవారం రాత్రి ఫైనల్ సీనియార్టీ జాబితా విడుదల చేశారు. అయితే, ఫిర్యాదులు స్వీకరించ కుండానే వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలని ఆదేశాలు జారీ చేయడంపై భాషా పండితులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రక్రియను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.
గుంతలో పడి టీచర్కు గాయాలు
రాత్రి దాకా సాగుతున్న కౌన్సెలింగ్ ప్రక్రియ టీచర్లకు లేని తిప్పలు తెచ్చిపెడుతోంది. కౌన్సెలింగ్ కేంద్రం వద్ద బుధవారం రాత్రి చోటుచేసుకున్న ప్రమాదంలో ఓ టీచర్కు గాయాలయ్యాయి. వివరాలు.. బుక్కపట్నం మండలం సిద్ధరాంపురం జిల్లా పరిషత్ పాఠశాలలో పనిచేస్తున్న సోషల్ టీచర్ పి. రామిరెడ్డి, బుక్కపట్నంలో ఎస్జీటీగా పని చేస్తున్న సుధారాణి దంపతులు. భార్య కౌన్సెలింగ్ నేపథ్యంలో బుధవారం పంగల్రోడ్డులోని ఆర్డీటీ స్కూల్కు రామిరెడ్డి వచ్చారు. రాత్రి కావడంతో భోజనం కోసమని కేంద్రం నుంచి బయటకు వెళ్తూ చీకట్లో ప్రమాదవశాత్తు గుంతలో పడ్డారు. చేతికి తీవ్ర గాయాలైన ఆయనను తోటి టీచర్లు నగరంలోని ఓ ఆసుపత్రికి తరలించారు.
నేడు కౌన్సెలింగ్ ఇలా...
క్రమ సంఖ్య 351 నుంచి 700 వరకు ఉన్న ఎస్జీటీలకు గురువారం ఉదయం పది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు, క్రమ సంఖ్య 701 నుంచి 1,000 వరకు సాయంత్రం నాలుగు గంటల నుంచి కౌన్సెలింగ్ ఉంటుందని డీఈఓ ప్రసాద్ బాబు తెలిపారు
● నేడు వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ
● జిల్లా అధ్యక్షుడు అనంత వెల్లడి