బుక్కరాయసముద్రం: యోగా ద్వారా ఒత్తిడిని దూరం చేసుకోవచ్చని ఏపీఎస్పీ 14వ బెటాలియన్ కమాండెంట్ ప్రభుకుమార్ పేర్కొ న్నారు. గురువారం మండల పరిధిలోని జంతలూరు వద్ద ఉన్న బెటాలియన్లో ‘యోగాంధ్ర’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కమాండెంట్ ప్రభుకుమార్ మాట్లాడుతూ నిత్యం ధ్యానం, యోగా చేస్తే మంచి ఆరోగ్యంపొందవచ్చన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ దేవి, అడిషనల్ కమాండెంట్ కేశవరెడ్డి, యోగా శిక్షక్ పతాంజలి డిస్ట్రిక్ ప్రొప్రయిటర్ డాక్టర్ రవి ప్రసాద్, డీఎస్పీలు ప్రసాద్రెడ్డి, వెంకటశివారెడ్డి పాల్గొన్నారు.
నా పిల్లిని చంపార్సార్
● పోలీస్ స్టేషన్లో ఓ వ్యక్తి ఫిర్యాదు
గార్లదిన్నె: తాను పెంచుకుంటున్న పిల్లిని చంపారంటూ కొందరిపై ఓ వ్యక్తి గార్లదిన్నె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి వివ రాల మేరకు.. మండల పరిధిలోని క్రిష్ణాపురానికి చెందిన రామాంజనేయులు తన ఇంట్లో పిల్లిని పెంచుకుంటున్నాడు. ఇటీవలే అది పిల్లలకు జన్మనిచ్చింది. ఈ క్రమంలో ఇంటి వద్ద చెట్టుపై ఉన్న పిల్లిని గురువారం కల్లూరుకు చెందిన కొంత మంది వేటగాళ్లు పట్టుకొని చంపేశారు. ఈ క్రమంలో ఆవేదన చెందిన రామాంజనేయులు.. మూగజీవాన్ని చంపిన వేటగాళ్లపై చర్యలు తీసుకోవాలని గార్లదిన్నె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
రెవెన్యూలో బది‘లీలలు’
● 9న జారీ చేసిన ఉత్తర్వుల్లో మార్పులు
● అదే తేదీతో తిరిగి ఉత్తర్వుల జారీ
అనంతపురం అర్బన్: గడువు ముగిసినా రెవెన్యూశాఖలో బది‘లీలలు’ కొనసాగించడం సర్వత్రా విమర్శలకు తావిస్తోంది. తాజాగా 11 మంది డిప్యూటీ తహసీల్దార్లు, 8 మంది సీనియర్ అసిస్టెంట్లకు స్థానచలనం కల్పించారు. డీటీలు, ఎస్ఏల బదిలీలకు సంబంధించి ఈనెల 9వ తేదీన జారీ చేసిన ఉత్తర్వుల్లో మార్పులు చేర్పులు చేశారు. అయితే, అదే తేదీపైనే ఉత్తర్వులను జారీ చేయడం గమనార్హం. రాజకీయ సిఫార్సుల మేరకు డీటీలు, ఎస్ఏల బదీలీల్లో మార్పు చేసినట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
మార్పులు ఇలా..
ఈనెల 9వ తేదీన 32 మంది డిప్యూటీ తహసీల్దార్లు, 38 మంది మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్లు, సీనియర్ అకౌంటెంట్లను బదిలీ చేశారు. తాజాగా 9వ తేదీనే పొందుపరుస్తూ ప్రస్తుతం జారీ చేసిన 11 మంది డీటీలకు సంబంధించిన బదిలీ ఉత్తర్వుల్లో... డీటీలు టి.కె.చంద్రశేఖర్రావు, ఎం.ఆంజనేయప్రసాద్, ఎం.కె.సూర్యనారాయణ, టి.బసవకుమార్, ఇ.వెంకటేశ్వర్లు స్థానాలను మార్పు చేశారు. అదే విధంగా 8 మంది ఎస్ఏల బదిలీలకు సంబంధించిన ఉత్తర్వుల్లో... జి.జీవన్ విజయ్ కుమార్, కె. వెంకటరామిరెడ్డి, వి.సందీప్, ఆర్.రాజేష్కుమార్కు స్థానాలు మార్పు చేశారు.
జిల్లా అంతటా వర్షం
● విడపనకల్లులో అత్యధికంగా 91.2 మి.మీ వర్షపాతం
● రాగల రెండు రోజులూ
జిల్లాకు వర్షసూచన
అనంతపురం అగ్రికల్చర్: జిల్లాపై నైరుతి రుతుపవనాలు ప్రభావం చూపుతున్నాయి. బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు 30 మండలాల పరిధిలో 18.4 మి.మీ సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా విడపనకల్లు మండలంలో 91.2 మి.మీ వర్షపాతం నమోదైంది. కణేకల్లు 59 మి.మీ, ఉరవకొండ 40.6, డి.హీరేహాళ్ 40, బెళుగుప్ప 36.4, యాడికి 27.8, శింగనమల 26.2, కళ్యాణదుర్గం 25.4, గుత్తి 22.8, గుంతకల్లు 21.4, అనంతపురం అర్బన్ 21.4, రాయదుర్గం 20.4, గార్లదిన్నె 19.2, వజ్రకరూరు, అనంతపురం రూరల్ 18.2, బుక్కరాయసముద్రం 16.2 , గుమ్మఘట్ట 14.8, కుందుర్పి 10.6, బ్రహ్మసముద్రం 10 మి.మీ వర్షపాతం నమోదైంది. మిగతా మండలాల్లో తేలికపాటి వర్షం కురిసింది. పంటల సాగుకు ఈ వర్షాలు ఊతమిస్తాయని అధికారులు తెలిపారు. రాగల రెండు రోజులు కూడా జిల్లాకు వర్షసూచన ఉన్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు.

యోగాతో ఒత్తిడి దూరం