
బుద్ధి తెచ్చుకో బాబూ..
● కొమ్మినేని అరెస్టు అన్యాయం
● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత
అనంతపురం కార్పొరేషన్: సీనియర్ జర్నలిస్టు కొమ్మినేని అరెస్టుపై సుప్రీంకోర్టు ఉత్తర్వులతోనైనా సీఎం చంద్రబాబు బుద్ధి తెచ్చుకుని, ప్రజా ప్రయోజనాలపై దృష్టిసారించాలని, లేని పక్షంలో చరిత్రహీనుడుగా నిలిచిపోతారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సాక్షి టీవీ డిబేట్లో విశ్లేషకులు వ్యాఖ్యలు చేస్తే కొమ్మినేని శ్రీనివాసరావుపై కేసు ఏవిధంగా నమోదు చేస్తారని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించిన విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు నియంత పాలనకు సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసిందని పేర్కొన్నారు. ఇటీవల సాక్షి టీవీలో జరిగిన ఓ డిబేట్ కార్యక్రమంలో విశ్లేషకుడు కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో అలజడి వాతావరణం సృష్టించారన్నారు. కొమ్మినేని శ్రీనివాసరావు అరెస్టులో కూటమి ప్రభుత్వం కనీస నిబంధనలను పాటించలేదన్న విషయం సుప్రీంకోర్టు తీర్పు ద్వారా స్పష్టమైందని తెలిపారు. రాష్ట్రంలో అమలవుతున్న రెడ్బుక్ రాజ్యాంగానికి ఈ తీర్పు కచ్చితంగా చెంపపెట్టని అభివర్ణించారు. ఇదే సమయంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన సతీమణి వైఎస్ భారతిపై కూడా దుష్ప్రచారం చేశారని, కుట్రపూరితకంగా సాక్షి కార్యాలయాలపై దాడి చేశారని, తక్షణం వారిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని కోరారు.
బీ ఫార్మసీ ఫలితాలు విడుదల
అనంతపురం: జేఎన్టీయూ అనంతపురం పరిధిలో ఏప్రిల్, మే నెలల్లో నిర్వహించిన బీ ఫార్మసీ ఒకటో సంవత్సరం ఒకటో సెమిస్టర్ (ఆర్–23) రెగ్యులర్, సప్లిమెంటరీ , (ఆర్–19), (ఆర్–15) సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యుయేషన్స్ ప్రొఫెసర్ వి. నాగప్రసాద్ నాయుడు శుక్రవారం విడుదల చేశారు. ఫలితాలను యూనివర్సిటీ వెబ్సైట్లో చూడాలని కోరారు.
మద్యం షాపుల దరఖాస్తుకు 19న చివరి గడువు
అనంతపురం: మద్యం షాపుల నిర్వహణకు సంబంధించి ఈ నెల 19 తేదీ లోపు దరఖాస్తులు అందజేయాలని ప్రొహిబిషన్ ఎకై ్సజ్ జిల్లా అధికారి రామ్మోహన్రెడ్డి తెలిపారు. తాడిపత్రి మున్సిపాలిటీలో మూడు, కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో ఒకటి, పెద్దవడుగూరులో ఒకటి చొప్పున మద్యం షాపుల నిర్వహణకు సంబంధించి ఆఫ్లైన్ లేదా, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. నాన్ రీఫండబుల్ కింద రూ.2లక్షలు డిపాజిట్ చేయాలి. ఈ నెల 21న జిల్లా కేంద్రంలోని ఎకై ్సజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో లాటరీ ప్రక్రియ ద్వారా అర్హులను ఎంపిక చేస్తారు.
‘పచ్చ’ నేతల ఇసుక మేత
● అడ్డుకున్న నిదనవాడ రైతులు
శింగనమల: పచ్చ నేతలు బరితెగించారు. పెన్నానదిలో ఇసుకను అక్రమంగా తవ్వి సొమ్ము చేసుకుంటున్నారు. ఇష్టారాజ్యంగా తవ్వకాలు చేపడుతుండడంతో రైతులు తిరగబడ్డారు. ఇసుక తవ్వకాలను అడ్డుకున్నారు. పెద్దవడుగూరు మండలానికి చెందిన టీడీపీ నాయకులు చిత్రచేడు వైపున పెన్నానది పరివాహక ప్రాంతంలో ఇసుకను తరలించి సొమ్ము చేసుకున్నారు. ఇక అక్కడి నుంచి శింగనమల మండలం నిదనవాడ సమీపంలోని పెన్నానది పరివాహక ప్రాంతంపై కన్నుపడింది. రెండు రోజుల నుంచి యథేచ్ఛగా జేసీబీని పెట్టి ఇసుకను తవ్వి టిప్పర్లద్వారా తరలించారు. విషయం తెలుసుకున్న నిదనవాడ రైతులు పార్టీలకతీతంగా ముందుకు వచ్చి ఇసుకాసురులకు చెక్పెట్టారు. అక్రమంగా పెద్దపెద్ద గుంతలు తవ్వి ఇసుక తరలిస్తే భూగర్భజలం తగ్గిపోతుందని వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న శింగనమల సీఐ కౌలుట్లయ్య సిబ్బందితో వచ్చి ఇసుక కోసం తీసిన గుంతలను పరిశీలించారు. ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

బుద్ధి తెచ్చుకో బాబూ..

బుద్ధి తెచ్చుకో బాబూ..