
తప్పని జాగరణ
అనంతపురం ఎడ్యుకేషన్: సెకండరీ గ్రేడ్ టీచర్ల(ఎస్జీటీల)కు జరుగుతున్న బదిలీల కౌన్సెలింగ్లో జాగరణ తప్పడం లేదు. వరుసగా మూడోరోజూ పడిగాపులు కాశారు. శుక్రవారం సీరియల్ నంబరు 1001 నుంచి 1800 దాకా పిలిచారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమైన కౌన్సెలింగ్ రాత్రంతా కొనసాగింది. పరిశీలకులు సుబ్బారావు, జిల్లా విద్యాశాఖ అధికారి ఎం.ప్రసాద్బాబు దగ్గరుండి పర్యవేక్షించారు. మరోవైపు తమకు అన్యాయం జరుగుతోందంటూ భాషాపండితులు నిరసన తెలియజేశారు. ఏటా బదిలీలు, సర్దుబాటు పేరుతో మానసిక వేదనకు గురి చేస్తున్నారని, శాశ్వత పరిష్కారం చూపాలంటూ ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కౌన్సెలింగ్ను అడ్డుకోవడంతో ఆగిపోయింది. చివరకు పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆందోళనకారులను బయటకు వెళ్లాలని చెప్పడంతో...కౌన్సెలింగ్కు ఆటంకం కల్గించకుండా శాంతియుత నిరసన తెలియజేస్తామని చెప్పి ప్లకార్డులు పట్టుకుని వేదికపై కూర్చున్నారు. మధ్యాహ్నం వరకు ఈ నిరసన కొనసాగింది. ఉపాధ్యాయ సంఘాల నాయకులు కలగజేసుకుని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర అధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని పరిశీలకులు, డీఈఓ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.