
న్యాయం జరిగే వరకూ పోరాటం
● మృతదేహానికి రీ పోస్టుమార్టం చేయాలి
● ఎమ్మెల్సీ కుంభా రవిబాబు
● బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతాం: వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ‘అనంత’
● పార్టీ ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో
నగరంలో నిరసన ర్యాలీ
అనంతపురం కార్పొరేషన్: తమ బిడ్డ తన్మయి కనిపించడం లేదని తల్లిదండ్రులు ఫిర్యాదు చేసినా పోలీసులు ఆలస్యంగా స్పందించారని, దర్యాప్తు ముమ్మరం చేయడంలో వెనుకంజ వేశారని, తన్మయిది ప్రభుత్వ హత్యేనని ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్, ఎమ్మెల్సీ కుంభా రవిబాబు ఆరోపించారు. వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో గురువారం నగరంలో జరిగిన నిరసన ర్యాలీకి ఉమ్మడి అనంత పురం జిల్లా నుంచి నాయకులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, పార్టీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి ముందుగా అంబేడ్కర్, దివంగత నేత వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అంబేడ్కర్ విగ్రహం నుంచి సప్తగిరి సర్కిల్, సూర్యనగర్ సర్కిల్, సంగమేశ్వర సర్కిల్ మీదుగా కలెక్టరేట్ వరకు ర్యాలీ చేపట్టారు. ర్యాలీలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా గిరిజనులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. కలెక్టరేట్ ముందు బైఠాయించారు. ఎమ్మెల్సీ కుంభా రవిబాబు, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంతలు తన్మయి తండ్రి లక్ష్మీపతితో కలసి కలెక్టరేట్లో ఆర్డీఓ మలోలకు వినతి పత్రం సమర్పించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. ఎమ్మెల్సీ కుంభా రవిబాబు మాట్లాడుతూ జూన్ 3న తన్మయి అదృశ్యమై 7న శవమై కన్పించిందన్నారు. ఫోరెన్సిక్ రిపోర్టులో 5నే తన్మయిని చంపేసి ఉండొచ్చని తెలియ జేశారన్నారు. ఈ క్రమంలో రెండు రోజుల పాటు యువతి ఎవరి ఆధీనంలో ఉందనే వివరాలను పోలీసులు ఎందుకు తెలపడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక సగటున రోజుకు ఇద్దరు మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయన్నారు.తన్మయి కుటుంబ సభ్యులు నలుగురిపై అనుమానం వ్యక్తం చేశారని, వారిపై కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేయడంతో పాటు యువతి మృతదేహానికి రీ పోస్టుమార్టం చేయాలని డిమాండ్ చేశారు.
కలెక్టర్కు తీరిక లేదా..?
యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్ మాట్లాడుతూ కలెక్టరేట్కు కూతవేటు దూరంలోని రామకృష్ణ కాలనీలో తన్మయి కుటుంబం ఉంటోందని, కనీసం బాధిత కుటుంబాన్ని పరామర్శించే తీరిక కూడా కలెక్టర్కు లేదా అని ప్రశ్నించారు. గిరిజన కుటుంబానికి జరిగిన అన్యాయంపై వినతి పత్రం అందించేందుకు వస్తున్నామని చెబితే కలెక్టర్ పత్తా లేకుండా పోయారన్నారు. దీన్ని బట్టి దళితులు, గిరిజనుల పట్ల ఏ స్థాయిలో చిన్నచూపు వైఖరి ప్రదర్శిస్తున్నారో అర్థమవుతోందన్నారు. గిరిజనలు, దళితులకు న్యాయం చేస్తామని గతంలో నారా లోకేష్ చెప్పారని,వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో 30 వేల మంది మహిళలు అదృశ్యమయ్యారని చెప్పిన పవన్ కల్యాణ్ ఇప్పుడు మహిళలకు అన్యాయం జరుగుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తన్మయి కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతామని ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసబాబు నాయక్, ‘ట్రైకార్’ మాజీ చైర్మన్ గుండా సురేంద్ర పేర్కొన్నారు. అనంతరం రామకృష్ణ కాలనీలోని తన్మయి నివాసానికి వెళ్లి మృతురాలి తల్లిదండ్రులను ఎమ్మెల్సీ, పార్టీ జిల్లా అధ్యక్షులు, తదితరులు పరామర్శించారు. కార్యక్రమంలో టీటీడీ బోర్డు మాజీ సభ్యులు అశ్వర్థ్ నాయక్, వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహులు, పార్టీ ఎస్టీ సెల్ నాయకులు సాకే శ్రీనివాసులు, గోవింద్నాయక్, మిద్దె నగేష్, గుజ్జల శివ, గుజ్జల లక్ష్మణ్కుమార్, సాకే రాజశేఖర్, రాజు నాయక్, మోహన్ నాయక్, గౌతం నాయక్, అంజనమూర్తి, సాకే శివశంకర్, ఆదిశేషు, మహిళా నాయకురాళ్లు చంద్రలేఖ, శోభాబాయి, శోభారాణి, దేవి, ఉష, భారతి పాల్గొన్నారు.
గిరిజన యువతి దారుణ హత్య విషయంలో ఓ సీఐను సస్పెన్షన్ చేసి ప్రభుత్వం చేతులు దులుపుకుంటామంటే చూస్తూ ఊరుకోబోమని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవడంతో పాటు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసే వరకూ పోరాటం ఆపమని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత స్పష్టం చేశారు.ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, ఐదు సెంట్ల స్థలం ఇవ్వాలన్నారు. రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో దళిత బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందని, ఆ ప్రాంతంపై టీడీపీకి పట్టుండడంతో ఎవరూ నోరు మెదపడం లేదని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయన్నారు. ఏడాది కూటమి పాలనలో 188 మందిపై అత్యాచారాలు జరిగాయని, అందులో 15 మంది మహిళలు హత్యకు గురయ్యారని చెప్పారు. బాధ్యత గల పదవిలో ఉన్న హోంమంత్రి అనిత హత్యలు జరుగుతుంటే తన వద్ద లాఠీ లేదు, తుపాకీ లేదు అంటూ నిర్లక్ష్యంగా మాట్లాడారని, ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి లేదని దుయ్యబట్టారు.

న్యాయం జరిగే వరకూ పోరాటం

న్యాయం జరిగే వరకూ పోరాటం