అన్యాయం జరిగినా స్పందించకూడదా? | - | Sakshi
Sakshi News home page

అన్యాయం జరిగినా స్పందించకూడదా?

Jun 13 2025 5:31 AM | Updated on Jun 13 2025 5:31 AM

అన్యాయం జరిగినా స్పందించకూడదా?

అన్యాయం జరిగినా స్పందించకూడదా?

‘సాక్షి’ పత్రికలో రాకుంటే

దారుణం బయటకు వచ్చేదేకాదు

మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, శైలజానాథ్‌, మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి

రాప్తాడురూరల్‌: ‘దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా ఒక దళిత మైనర్‌ బాలికకు ఘోరమైన అన్యాయం జరిగింది. బాధిత కుటుంబానికి అండగా నిలిచేందుకు మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు పరామర్శించేందుకు వెళ్తుంటే పోలీసులతో అడ్డుకుంటారా.. మేమేమైనా టెర్రరిస్టులమా..’ అని మాజీ మంత్రి మేరుగ నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నగర శివారు లోని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మేరుగ నాగార్జున మాట్లాడుతూ 14 ఏళ్ల దళిత బిడ్డను 18 మంది అఘాయిత్యం చేసిన ఘటనపై స్పందించి అండగా నిలిచేందుకు వస్తే అరెస్ట్‌ చేశారన్నారు. దీన్ని బట్టి రాష్ట్రంలో ఎలాంటి ప్రజాస్వామ్యం ఉందో, ఈ ప్రాంతంలో ఎలాంటి పాలన సాగుతోందో అర్థమ వుతోందన్నారు. హోం మంత్రి, ఈ ప్రాంతంలోని ఎస్సీ శాసనసభ్యులు ఎందుకు మౌనం పాటిస్తున్నారని ప్రశ్నించారు. టీవీలో ఎక్కడో ఏదో మాట్లాడారంటూ అరెస్ట్‌లు చేస్తున్న ప్రభుత్వం, దళిత బిడ్డకు జరిగిన అన్యాయంపై ఎందుకు స్పందించలేదన్నారు. దీనిపై గవర్నరును కలిసి ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.

దళితురాలిగా పుట్టడమే నేరమా..

దళితులుగా పుట్టడం తప్పా అందులోనూ బాలికగా పుట్టడం నేరమా అని మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌ ప్రశ్నించారు. దళిత బాలికపై అఘాయిత్యానికి పాల్పడినందుకు పేరూరులో విజయోత్సవాలు చేసుకున్నారా.. లేదంటే తమ దెబ్బకు ఎవరినీ రానీ యలేదన్నందుకు విజయోత్సవాలు చేసుకున్నారా.. అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కచ్చితంగా ఆ గ్రామానికి వెళ్లి తీరతామన్నారు. దీనిపై ప్రత్యేక జ్యుడీషియల్‌ విచారణ జరగాలన్నారు. ‘సాక్షి’ పత్రికలో వార్త వస్తే తప్ప ఈ ఘోరం వెలుగులోకి రాలేదని వాపోయారు.

ప్రత్యేక పాస్‌పోర్ట్‌ కావాలా..

బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్తుంటే ఎక్కడికక్కడ పోలీసులను పెట్టి అడ్డుకున్నారని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తెలిపారు. ఆ ప్రాంతాలకు వెళ్లేందుకు వీసాలు తీసుకోవాలా.. పాస్‌పోర్టులు ఉండాలా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సామూహిక అత్యాచారం కేసులో నిందితుల బంధువులు, టీడీపీ శ్రేణులు, పరిటాల సునీత బంధువులు పేరూరులో తమ వాహనాలపై రాళ్లతో దాడి చేసి భయోత్పాతం సృష్టించారన్నారు. పరిటాల సునీత అండతోనే కర్రలు, ఇతర మారణాయుధాలతో వీరంగం సృష్టించారన్నారు. పోలీసులు సమాజానికి ఎలాంటి మెసేజ్‌ ఇవ్వాలనుకుంటున్నారని ప్రశ్నించారు. 2014–2019 మధ్య జరిగిన అన్యాయాలు, దౌర్జన్యాలను ప్రశ్నించిన తనను రామగిరి మండలంలోకి అడుగు పెట్టనివ్వలేదని, దాని ఫలితం అనుభవించారన్నారు. మహిళా ఎమ్మెల్యేగా ఉన్న సునీత ఇలాంటి ఘటనలను ప్రోత్సహించడం దురదృష్టకరమన్నారు. సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ గిరిజమ్మ, వైఎస్సార్‌ సీపీ మడకశిర నియోజకవర్గ సమన్వయకర్త ఈరలక్కప్ప, మధుమతి రెడ్డి, పార్టీ ఎస్సీ సెల్‌ నాయకులు పెన్నోబులేసు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement