
తెల్లవార్లూ టీచర్ల కౌన్సెలింగ్
అనంతపురం ఎడ్యుకేషన్: ఎస్జీ టీచర్ల కౌన్సెలింగ్ తెల్లవార్లూ కొనసాగింది. తొలిరోజు 350 మంది పూర్తవగా... రెండోరోజు గురువారం సీరియల్ నంబరు 351 నుంచి 1,000 దాకా పిలిచారు. ఉదయం 11.30 గంటలకు ప్రారంభమైన కౌన్సెలింగ్ తెల్లవార్లూ కొనసాగింది. కాగా శుక్రవారం ఉదయం 11 గంటలకు సీరియల్ నంబరు 1,001 నుంచి 1,800 వరకు కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని డీఈఓ ప్రసాద్బాబు తెలిపారు.
టీచరుపై రెచ్చిపోయిన పరిశీలకులు
‘బొచ్చు గాడివి నీకేం సమాధానం చెప్పాలి’ అంటూ ఉపాధ్యాయ బదిలీ కౌన్సెలింగ్లో పరిశీలకులుగా వచ్చిన జాయింట్ డైరెక్టర్ సుబ్బారావు గురువారం ఓ టీచరుపై రెచ్చిపోయారు. దీంతో కౌన్సెలింగ్ కేంద్రంలో కొద్దిసేపు తీవ్ర గందరగోళం నెలకొంది. ప్రత్యక్ష సాక్షులు తెలిపిన మేరకు...తనకల్లు మండలంలో ప్రభాకర్ టీచరుగా పని చేస్తున్నారు. ఈయన భార్య స్పౌజ్ పాయింట్లు వాడుకున్నారు. ఈ క్రమంలో కౌన్సెలింగ్ సమయంలో భర్త పని చేస్తున్న తనకల్లు మండలంలోనే కోరుకోవాలంటూ అధికారులు సూచించారు. ఈ సమయంలో కలగజేసుకున్న భర్త ప్రభాకర్... సర్ తనకల్లు మండలం కాకుండా పక్క మండలం కదిరి రూరల్లో ఇచ్చేలా చూడాలని కోరారు. అలా కుదరదని ‘స్పౌజ్’ విషయంలో అందరికీ ఒకే నిబంధన పాటిస్తున్నామంటూ అధికారులు తెలిపారు. ఈ క్రమంలో సదరు టీచర్.. ‘అన్నీ కరెక్ట్గా చేశామంటున్నారు.. అలా చేసినట్లు రాతపూర్వకంగా ఇవ్వండి’ అంటూ అడిగారు. దీంతో అక్కడే ఉన్న పరిశీలకులు సుబ్బారావు రెచ్చిపోయారు. ‘నువ్వు బొచ్చుగాడివి అడిగితే మేము చెప్పాలా’ అని మాట్లాడారు. సదరు టీచరు కూడా అంతేస్థాయిలో సమాధానం ఇచ్చారు. సాధారణ టీచరుకు ఇచ్చే గౌరవం ఇదేనా.. అని ప్రశ్నించారు. ఉపాధ్యాయులు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, డీఈఓ కార్యాలయ సిబ్బంది అంతా వేదికపైకి దూసుకురావడంతో కాసేపు గందరగోళం నెలకొంది. అందరూ సర్దిచెప్పడంతో సమస్య సద్దుమణిగింది.

తెల్లవార్లూ టీచర్ల కౌన్సెలింగ్