
ప్రభుత్వ అలసత్వంతోనే దారుణాలు
అనంతపురం కార్పొరేషన్: కూటమి ప్రభుత్వం అలసత్వంతోనే మృగాళ్లు దారుణాలకు పాల్పడుతున్నారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. చట్టాలను అమలు చేయాల్సిన పోలీసులు తమ విధుల్లో పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి కనువిప్పు కల్గించేలా వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ ఆధ్వర్యంలో గురువారం నిరసన ర్యాలీ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. బుధవారం స్థానిక వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ ఎస్టీ సెల్ నాయకుల ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ‘అనంత’ మాట్లాడుతూ రామగిరి మండలం ఏడుగుర్రాలపల్లిలో పాశవికంగా అత్యాచారానికి గురైన బాలిక.. తనకు జరిగిన అన్యాయాన్ని బయటకు చెప్పడానికి కూడా భయపడుతోందంటే రాష్ట్రంలో పరిస్థితులు ఏవిధంగా ఉన్నాయో చెప్పాల్సిన పనిలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే ఉమ్మడి అనంతపురం జిల్లాలో మూడు హృదయ విదారక ఘటనలు జరిగాయన్నారు. ఇలాంటి దారుణాలు పునరావృతం కాకుండా చూసేందుకు, చంద్రబాబు ప్రభుత్వానికి కనువిప్పు కల్గించేందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో ఉద్యమ కార్యాచరణ రూపొందించామన్నారు. పార్టీ వివిధ విభాగాల సమన్వయంతో ఇటీవల పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టామని, దీనిపై ఎస్పీ జగదీష్ స్పందించి సంబంధిత పోలీసులపై చర్యలు తీసుకున్నారని తెలిపారు. జిల్లా కేంద్రంలో ఓ యువతికి అన్యాయం జరిగితే గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించి మృతురాలి కుటుంబానికి రూ.10 లక్షలతో పాటు ఇంట్లో ఒకరికి ఉద్యోగం, 5 సెంట్ల స్థలం ఇచ్చి ఆదుకున్న విషయాన్ని గుర్తు చేశారు. కానీ కూటమి ప్రభుత్వంలో తీరని అన్యాయానికి గురైన వారికి న్యాయం చేసే దిశగా ప్రభుత్వం కనీస చర్యలు కూడా తీసుకోలేదని దుయ్యబట్టారు. కనీసం ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించలేదంటే చంద్రబాబు ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంతో ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఈ క్రమంలో బాధిత గిరిజన కుటుంబానికి, మైనర్ బాలికకు అండగా నిలిచి, వారికి న్యాయం జరిగే వరకు పోరాడాలని నిశ్చయించామన్నారు. భవిష్యత్తులో ఎవరైనా దుశ్చర్యలకు పాల్పడితే ఇబ్బందులు తప్పవని, మృగాళ్లకు శిక్షపడే వరకు వైఎస్సార్ సీపీ పోరాడుతుందని స్పష్టం చేశారు.
భారీ ర్యాలీకి తరలిరండి...
గురువారం ఉదయం 10 గంటలకు నగరంలోని అంబేడ్కర్ విగ్రహం నుంచి సప్తగిరి, సంగమేశ్వర్ సర్కిల్ మీదుగా కలెక్టరేట్ వరకు జరిగే ర్యాలీలో ఎస్టీ సెల్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మూడే శ్రీనివాస్ నాయక్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు సాకే చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. ఎస్టీలు తరలిరావాలని ఆయన కోరారు. సమావేశంలో వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు సాకే శ్రీనివాసులు, గోవింద్ నాయక్, ప్రధాన కార్యదర్శి గుజ్జల శివ, నగరాధ్యక్షులు గుజ్జల శివయ్య, సాకే రాజశేఖర్, రాజు నాయక్, సాకే మురళీ, సాకే ఆనంద్, ముంగా ప్రదీప్, సాకే నాగార్జున తదితరులు పాల్గొన్నారు.