
కాంగ్రెస్లో భగ్గుమన్న విభేదాలు
● మధ్యలోనే అలిగి వెళ్లిపోయిన పీసీసీ అధ్యక్షురాలు షర్మిల
అనంతపురం టవర్క్లాక్: అనంతపురంలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన సమావేశం రసాభాసగా మారింది. నాయకుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. సమావేశానికి ముఖ్యఅతిథిగా పీసీసీ అధ్యక్షురాలు షర్మిల హాజరయ్యారు. సీనియర్లను స్టేజీ పైకి పిలవనందుకు నిరసన తెలుపుతూ సీనియర్ నాయకుడు ఫిరోజ్ఖాన్ కింద కూర్చున్నారు. అది గమనించిన షర్మిల కూడా వేదిక దిగొచ్చి కుర్చీపై కూర్చున్నారు. కాసేపటికి సమావేశం ప్రారంభం కాగా.. నాయకుల మధ్య విభేదాలు బయటపడ్డాయి. గుంతకల్లు నియోజకవర్గ నాయకులు ప్రభాకర్, నబీరసూల్ మధ్య గొడవ తారస్థాయికి చేరుకుని.. నబీరసూల్పై ప్రభాకర్ చేయి చేసుకున్నారు. వారికి నచ్చజెప్పి సమావేశం కొనసాగించారు. షర్మిల మాట్లాడుతూ జిల్లాలో నాయకత్వ లోపంతో పార్టీ అభివృద్ధి కాలేదని, ఇక్కడి సమస్యలపై అధిష్టానంతో చర్చించి త్వరలోనే అన్ని కమిటీలు వేస్తామని అన్నారు. ఈ క్రమంలోనే మళ్లీ గొడవ జరిగింది. డీసీసీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి జిల్లాలోని నాయకులను కలుపుకొని పోలేదంటూ పలువురు మండిపడ్డారు. దీంతో షర్మిల సమావేశం మధ్యలోనే ఆపేసి అలిగి వెళ్లిపోయారు.