
తూకంలో బురిడీ
● స్టోర్లలో బియ్యం నొక్కేస్తున్న
కొందరు డీలర్లు
● రెండు కిలోల నుంచి
ఐదు కిలోల మేర కోత
● అధికారుల పర్యవేక్షణ కరువు
అనంతపురం అర్బన్: ప్రజా సంక్షేమానికి పాతర వేస్తూ, డీలర్ల స్వప్రయోజనాలకు పెద్దపీట వేస్తూ బియ్యం, సరుకులు నొక్కుడుకు కూటమి ప్రభుత్వం రాచబాట వేసిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. బియ్యం తూకం తక్కువగా ఇస్తున్నారని లబ్ధిదారులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో 1,645 చౌక ధరల దుకాణాలు ఉన్నాయి. గతంలో వీటి పరిధిలో 405 ఎండీయూ వాహనాలు ఇంటింటికీ రేషన్ పంపిణీ చేస్తూ వచ్చాయి. రేషన్ కార్డులకు బియ్యం, ఇతర సరుకుల కోటాను డీలర్ల నుంచి ఎండీయూ నిర్వాహకులు తీసుకుని ఇంటింటికీ వెళ్లి పంపిణీ చేసేవారు. ఈ విధానంలో డీలర్ కోటా మేరకు ఎండీయూకి బియ్యం కచ్చితమైన తూకం ఇచ్చేవారు. దీంతో డీలర్లకు బియ్యం, కంది పప్పు, చక్కెర మిగుల్చుకునే అవకాశం ఉండేది కాదు. కూటమి ప్రభుత్వం ఆ విధానానికి స్వస్తి పలికి స్టోర్ ద్వారా పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవడంతో ప్రస్తుతం డీలర్లు కార్డుదారులను తూకాల్లో బురిడీ కొట్టిస్తున్నారు. రెండు నుంచి 5 కిలోలు వరకూ బియ్యం తక్కువగా, మిగతా సరుకులు ఇవ్వకుండా మిగుల్చుకుంటున్నారు. అధికారులు స్టోర్లను తనిఖీ చేస్తారే తప్ప స్టోర్ నుంచి లబ్ధిదారులు తెచ్చే బియ్యం తూకం గురించి పట్టించుకోవడం లేదు. వాటిని తూకం వేస్తే డీలరు ఎన్ని కిలోలకు ఎన్ని కిలోలు తక్కువగా ఇస్తున్నారనేది బయపడుతుందని పలువురు చెబుతున్నారు.
బ్లాక్మార్కెట్కు..
తూకం తేడాతో మిగుల్చుకున్న సరుకులను బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నారు. అనుమానం రాకుండా బియ్యాన్ని కొత్త సంచుల్లో ఉంచి తరలిస్తున్నారు. ఈ బియ్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రత్యేకంగా కొందరు వ్యక్తులు ఉంటున్నారు. కిలో రూ.10 నుంచి రూ.12తో కొనుగోలు చేసి కర్ణాటక, ఇతర ప్రాంతాలకు అక్రమంగా రవాణా చేస్తున్నారు.