
ఆర్డీటీ లేని ప్రాంతాన్ని ఊహించలేం
కుందుర్పి: ఆర్డీటీ లేని ప్రాంతాన్ని ఊహించలేమని కళ్యాణదుర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎంపీ తలారి రంగయ్య అన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చలేని పాలకులు.. ఆవు లాంటి ఆర్డీటీని జిల్లా నుంచి తరిమేసే కుట్రలకు తెరలేపారని మండిపడ్డారు. రంగయ్య చేపట్టిన ఆర్డీటీ పరిరక్షణ పాదయాత్ర సోమవారం ఆరో రోజు కుందుర్పి మండలం యర్రగుంటకు చేరుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఆర్డీటీనీ కాపాడుకుని తీరుతామని మరోసారి స్పష్టం చేశారు.ఈ ప్రాంతంలో ఆర్డీటీ సేవలు ఆగిపోతే జరిగే నష్టాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. తనను అరెస్ట్ చేసినా... చైతన్యవంతులైన ప్రజలే ఆర్డీటీని కాపాడుకుంటారని అన్నారు. గ్రామానికి చెందిన చిట్టెమ్మ మాట్లాడుతూ.... తనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారని, షుగర్ వ్యాధితో బాధపడుతున్న తాను ఇప్పటి వరకూ ఆర్డీటీ ఆస్పత్రిలోనే ఉచితంగా చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. ఇటీవల విదేశీ నిధులు రాకపోవడంతో ఆస్పత్రిలో మందుల కొరత కారణంగా డబ్బులు ఖర్చు పెట్టి బయట కొనాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్డీటీ లేకపోతే తన ఇద్దరు పిల్లల పెళ్లిళ్లు ఎలా చేయాలో అర్థం కావడం లేదని కన్నీరు పెట్టుకున్నారు.
● ఆర్డీటీ సేవల పునరుద్ధరణకు తలారి రంగయ్య సాగిస్తున్న పోరాటాన్ని అడ్డుకునేందుకు పోలీసులను పావుగా వాడుకునేందుకు కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ అన్నారు. పాదయాత్ర అపిలేపల్లికి చేరుకున్న సందర్భంగా ఆయన తలారి రంగయ్యను కలసి సంఘీభావాన్ని తెలిపారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో మాటాడారు. ఆర్డీటీ లేకపోతే ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు తీరని అన్యాయం జరుగుతుందన్నారు. ప్రభుత్వానికి సమాంతరంగా పనిచేస్తున్న ఆర్డీటీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శిలు తిప్పేస్వామి, తరిమెల గోకుల్రెడ్డి, పార్టీ నేత మాదినేని ఉమామహేశ్వరనాయుడు, ఎంపీపీ కమలానాగరాజు, పార్టీ మండల కన్వీనర్ హనుమంతరాయుడు, మున్సిపల్ చైర్మన్ రాజ్కుమార్, పార్టీ ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి చామలూరు రాజగోపాల్, అనంతపురం మార్కెట్ యార్డు మాజీ చైర్మెన్లు ఫయాజ్, సత్యనారాయణరెడ్డి, గార్లదిన్నె నారాయణరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఆరో రోజు పాదయాత్రలో మాజీ ఎంపీ తలారి రంగయ్య

ఆర్డీటీ లేని ప్రాంతాన్ని ఊహించలేం